సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'సర్కారు వారి పాట' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అయితే ఈ సినిమాపై ఓ ఛానెల్ నెగెటివ్ ప్రచారం చేసింది. 'సర్కారు వారి పాట' థియేటర్లు ఖాళీ అంటూ పలుమార్లు టెలికాస్ట్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ సదరు ఛానెల్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.


తాజాగా మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ 'సర్కారు వారి పాట' సినిమా గురించి ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడారు. సినిమా చాలా బాగుందని.. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉందని.. సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉందని చెప్పారు. ఈ సినిమా అన్ని సెంటరస్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంటే.. కొన్ని ఛానెల్స్ మాత్రం సినిమా బాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 


జనాల్లో ఈ సినిమాకి డివైడ్ టాక్ అనేదే లేదని అన్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు 'పోకిరి' కంటే కూడా చాలా యంగ్ గా కనిపిస్తున్నాడంటూ మురిసిపోయారు కృష్ణ. మహేష్ చాలా మెయింటైన్ చేస్తాడని.. షూటింగ్ లేని రోజుల్లో ఎక్కువ సమయం జిమ్ లోనే ఉంటాడని అన్నారు. 'సర్కారు వారి పాట' సినిమా గురించి సుప్రీం కోర్టులో మాట్లాడాలని.. అంత మంది కథ తీసుకున్నారని చెప్పారు. 


ఇక మే 31న కృష్ణ పుట్టినరోజు కాబట్టి వేడుకల గురించి ప్రశ్నించగా.. స్ట్రెయిన్ అవుతున్న కారణంగా గత ఐదేళ్లుగా బయటకు వెళ్లడం లేదని.. తన చిన్న కూతురు ప్రియదర్శినితో కలిసి ఉంటున్నానని.. తనకు ఇష్టమైన వంటకాలు అన్ని చేస్తుందని తెలిపారు. 'సర్కారు వారి పాట' సినిమాను ఇంట్లో హోమ్ థియేటర్లో చూశానని.. సినిమా చూడగానే మహేష్ కి ఫోన్ చేశానని చెప్పారు. చాలా బాగా నటించావని.. 'పోకిరి', 'దూకుడు' కంటే 'సర్కారు వారి పాట' పెద్ద హిట్ అవుతుందని చెప్పడంతో మహేష్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడని అన్నారు. భవిష్యత్తులో మహేష్ బాబు 'అల్లూరి సీతారామరాజు' సినిమా చేసే ఛాన్స్ ఉందా..? అని ప్రశ్నించగా.. వంద శాతం మహేష్ ఈ సినిమా చేయడని స్పష్టం చేశారు.