సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది. ఈ సినిమాలో సరికొత్త లుక్ తో కనిపించబోతున్నారు మహేష్ బాబు. చాలా ఏళ్ల తరువాత త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. 

 

#SSMB28Aarambham:

ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వక ముందు, షూటింగ్ మొదలైన తరువాత.. సినిమాకి టైటిల్ ఇదేనంటూ చాలా రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. షూటింగ్ మొదలుపెట్టిన రోజు #SSMB28Aarambham అంటూ మేకర్స్ ఒక హ్యాష్ ట్యాగ్ వదలడంతో.. ఈ సినిమాకి టైటిల్ హింట్ ఇచ్చేశారని అందరూ భావించారు. 'ఆరంభం'(Aarambham) అనేది  సినిమా టైటిల్ అని.. అందుకే అలా ట్యాగ్ చేశారంటూ ఆ టైటిల్ ను ట్రెండ్ చేశారు. 

 

'అయోధ్యలో అర్జునుడు':

మేకర్స్ మాత్రం ఈ టైటిల్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మరో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు త్రివిక్రమ్, ఇటు మహేష్ బాబు ఇద్దరి సెంటిమెంట్ కలగలిసేలా 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ పెట్టబోతున్నారని టాక్. ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదివరకు త్రివిక్రమ్ సినిమాల టైటిల్ విషయంలో ఏం జరిగేదో అందరికీ తెలిసిందే. ఒక టైటిల్ ను వారే క్రియేట్ చేసి జనాల్లోకి వదిలేవారు. ఆ టైటిల్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి టైటిల్ మార్చడమా..? ఫైనల్ చేయడమా..? అనే విషయంలో నిర్ణయం తీసుకునేవారు. మరిప్పుడు 'అయోధ్యలో అర్జునుడు' టైటిల్ ను ఫైనల్ చేస్తారో లేదో చూడాలి!

 

ఈ సంగతులు పక్కన పెడితే.. ఇప్పటినుంచే ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలపై నిర్మాతలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ రైట్స్ కోసం నిర్మాతలు రూ.23 కోట్లు కోట్ చేస్తున్నట్లు సమాచారం. అది కాకుండా.. సౌత్ లో నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్ కోసం రూ.100 కోట్లు అడుగుతున్నారట. వీటితో పాటు ప్రముఖ ఓటీటీ సంస్థతో డిజిటల్ రైట్స్ కోసం చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతానికైతే హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ కి సంబంధించిన బేరాలు నడిపించడం లేదు.


నైజాంలో సినిమా హక్కులు రూ.45 కోట్ల రేంజ్ లో ఉంటాయట. ఆంధ్రలో రూ.50 కోట్లు, సీడెడ్ లో రూ.20 కోట్ల రేంజ్ లో అమ్మాలని చూస్తున్నారు. ఇవన్నీ ఫిక్స్ అయితే రూ.140 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ మీద, మరో రూ.140 కోట్ల నాన్ థియేట్రికల్ రైట్స్ మీద దక్కించుకోవాలని చూస్తున్నారు నిర్మాతలు. ఎలాగో బేరాలు ఉంటాయి కాబట్టి అటు ఇటు చూసుకున్నా.. ఈ సినిమాతో రూ.250 నుంచి రూ.280 కోట్ల బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఆ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో లేదో చూడాలి!


తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెడుతున్నారు త్రివిక్రమ్. పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ మాత్రం యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. అందుకే మంచి యాక్షన్ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నారు.