'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా విడుదల వాయిదా పడింది. తొలుత ఈ నెల 25న విడుదల చేయాలని అనుకున్నారు. ఆ రోజు 'భీమ్లా నాయక్' రాదనే నమ్మకంతో సినిమా ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే... యంగ్ హీరోలకు షాక్ ఇస్తూ, ఫిబ్రవరి 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు ప్రకటించారు. దాంతో సినిమాను ఓ వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించినట్టు తెలిసింది.


శర్వానంద్, రష్మికా మందన్నా జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ఇప్పుడీ సినిమాను మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు ప్రకటించారు.  ఆల్రెడీ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. క్లీన్ 'యు' సర్టిఫికెట్ లభించింది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదని యూనిట్ సభ్యులు తెలిపారు.


Also Read: ట్రోలింగ్ ఆపేస్తారా? 10 కోట్లు కడతారా? - మంచు ఫ్యామిలీ హెచ్చరిక


'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి' సినిమాలు తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన తాజా సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశీ ప్రధాన  పాత్రల్లో, 'వెన్నెల' కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: సుజిత్ సారంగ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్. 


Also Read: చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన విజయ్, వీడియో వైరల్