పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇప్పటికే సినిమా టీజర్లు, పాటలను విడుదల చేయగా.. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 21న హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. 


ఇండస్ట్రీ నుంచి పేరున్న తారలు గెస్ట్ లుగా హాజరు కానున్నారని సమాచారం. మరోపక్క తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ కూడా గెస్ట్ గా వస్తున్నట్లు తెలుస్తోంది. సినీ సెలబ్రిటీలతో కేటీఆర్ కి మంచి బాండింగ్ ఉంది. గతంలో కొన్ని సినిమా ఈవెంట్స్ కి ఆయన గెస్ట్ గా వచ్చారు. రామ్ చరణ్ నటించిన 'ధృవ' ఈవెంట్ కి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేటీఆర్. 


ఇప్పుడు 'భీమ్లానాయక్' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి ఆయన్ను అతిథిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో పవన్-రానా కాంబినేషన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు. పక్కా మాస్ ఎమోషనల్ కథగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా 'భీమ్లానాయక్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. 


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తోన్న ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. పవన్ కి జోడీగా నిత్యామీనన్ కనిపించనుంది. రానా భార్య క్యారెక్టర్ లో సంయుక్త మీనన్ కనిపించనుంది.