బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సినిమా పఠాన్ థియేటర్లో సందడి చేసి చాలా కాలం అయ్యింది. సుమారు 4 సంవత్సరాల కిందట జీరో సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడియెన్స్ ను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత షారుఖ్ కొంతకాలం సినిమాలు చేయలేదు. తాజాగా మరో రెండు క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల చెంతకు చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టుల్లో ఒక దానిని జవాన్ పేరుతో తమిళ దర్శకుడు అట్లీ తెరెక్కిస్తున్నారు. మరో సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో పఠాన్ పేరుతో సిద్దార్థ్ ఆనంద్ రూపొందిస్తున్నాడు. 


పఠాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనే నటిస్తోంది. భారీ బడ్జెట్ తో  ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ ప్రతిష్ట్మాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా  వచ్చే ఏడాది(2023), జనవరి 25న ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో జాన్‌ అబ్రహాం విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రతిష్ఠాత్మక యష్ రాజ్‌ ఫిల్మ్స్‌ సుమారు  రూ.250 కోట్లతో నిర్మిస్తున్న ఈ సినిమా  యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని సినిమా యూనిట్ భావిస్తుందట. ఇదే విషయాన్ని హీరో షారుఖ్ ఖాన్ కు చెప్పిందట. కానీ, తాను ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొనబోనని ఆయన చెప్పారట. బాలీవుడ్ బాయ్ కాట్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారట.   


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ బడా హీరోలు ఈ ప్రచారం దెబ్బకు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా వచ్చిన పలు సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పొందాయి.  ఈ నేపథ్యంలోనే షారుఖ్‌ ఖాన్ ‘పఠాన్‌’ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ‘బాయ్‌ కాట్‌ పఠాన్‌’ హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. సినిమా విడుదల తేదీ ప్రకటించిన దగ్గరి నుంచే ఈ సినిమాపై బాయ్‌ కాట్‌ ట్రెండ్ మొదలయ్యింది. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పరిస్థితి మరింత  తీవ్రమయ్యే అవకాశం ఉందని షారుఖ్‌ భావిస్తున్నారట. ఏ సమయంలో పఠాన్‌ ప్రమోషన్ మొదలు పెట్టాలి? ఏ విధంగా చేయాలి? అనే విషయంపై  సినిమా యూనిట్ తో చర్చిస్తున్నారట. ప్రస్తుతానికి తాను ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని చెప్పారట.


గత కొద్ది కాలంగా బాయ్ కాట్ బాలీవుడ్ ప్రభావంతో పలు సినిమాలు చాలా నష్టపోయాయి. అమీర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, రణబీర్‌ కపూర్‌ సినిమాల వసూళ్లు లేక బాక్సాఫీస్ దగ్గర అపజయాలను మూటగట్టుకున్నాయి. ఇక పఠాన్ సినిమా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. అటు షారుఖ్ నటించిన జవాన్‌, డంకీ సినిమాలు సైతం వచ్చే ఏడాదే విడుదలకానున్నాయి.


Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు


Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ