Shah Rukh Khan: సినీ ప్రేమికులు తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ తో సెల్ఫీ దిగేందుకు, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అనుకుంటారు. అదే తరహాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో సెల్ఫీ దిగేందుకు ఓ ఫ్యాన్ ప్రయత్నించాడు. కానీ షారుఖ్ మాత్రం దానికి నిరాకరించాడు. అంతే కాదు అతని చేతిని దూరంగా నెట్టివేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ముంబై విమానాశ్రయం నుంచి తన మేనేజర్ పూజా దద్లానీతో కలిసి బయటికొస్తున్న సమయంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ఎప్పటిలాగే ఓ సాధారణ అనుభవం ఎదురైంది. తన ఫెవరేట్ హీరోను చూసిన ఆనందంతో ఓ అభిమాని షారుఖ్ తో ఫొటో దిగాలని ఆశపడ్డాడు. షారుఖ్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడి చేతిని షారుఖ్ దూరంగా నెట్టేశాడు. ఫొటోకు ఫోజివ్వడానికి నిరాకరించాడు. అంతకు ముందు ఎయిర్ పోర్టులో అతనికి అభిమానులు, ఫొటోగ్రాఫర్లు ఘన స్వాగతం పలికారు. అది జరిగిన కాసేపటికే ఈ సెల్ఫీ వివాదం చోటు చేసుకుంది. 


ఆ తర్వాత తన సెక్యూరిటీతో కలిసి కారు వద్దకు వెళ్లిపోయారు. ఈ సమయంలో షారుఖ్ నల్లటి టీ-షర్ట్, మ్యాచింగ్ లెదర్ జాకెట్, ప్యాంటు ధరించి ఉన్నాడు. దాంతో పాటు స్నీకర్స్, ముదురు సన్ గ్లాసెస్‌ని పెట్టుకుని అందర్నీ ఆకర్షించాడు.


గత వారం రాజ్‌కుమార్ హిరానీ నెక్ట్స్ చిత్రం 'డుంకీ'ని చిత్రీకరించడానికి షారుక్ ఖాన్ కాశ్మీర్ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో షారుఖ్ ..  అభిమానులతో ఆ చల్లని వాతావరణంలో ఫొటోలకు పోజులిస్తూ కనిపించాడు. ఈ సమయంలో షారుఖ్ నలుపు రంగు పఫర్ జాకెట్, దానికి సరిపోయే కార్గో ప్యాంటు ధరించి ఉన్నాడు.


ఆ తర్వాత శ్రీనగర్ విమానాశ్రయంలోనూ షారుఖ్ కు అభిమానుల నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నించారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి వస్తున్న సమయంలో సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా అతని వద్దకు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. దీంతో అలర్ట్ అయిన షారుఖ్ సెక్యూరిటీ.. అతన్ని వారి నుంచి బయటకు తీసుకువచ్చి.. అక్కడ్నుంచి తరలించారు.




ప్రస్తుతం షారుఖ్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో నటి తాప్సీ పన్నుతో 'డుంకీ' మూవీలో నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఈ సినిమా షూటింగ్ ను లండన్, సౌదీ అరేబియా తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాతో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ తో షారుఖ్ మొదటిసారి స్ర్కీన్ షేరింగ్ చేసుకోనున్నారు.
 
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ నటించిన 'పఠాన్‌' చిత్రం జనవరిలో విడుదలైంది. దీపికా పదుకొణె, జాన్ అబ్రహంలు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. పఠాన్ బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక దర్శకుడు అట్లీ రాబోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'జవాన్‌'లో షారుఖ్..  నయనతార, విజయ్ సేతుపతితో కలిసి నటించనున్నాడు. జవాన్ జూన్ 2, 2023న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో షారుఖ్ ఓ ప్రత్యేక సన్నివేశంలో కనిపించనున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. అంతకుముందు వచ్చిన 'పఠాన్' లోనూ షారుఖ్, సల్మాన్ కనిపించి, కనువిందు చేశారు.


Read Also: అప్పుడు వినేవారు కాదు, ఇప్పుడు వింటున్నారు - సోదరుల విడాకులపై సల్మాన్ ఫన్నీ కామెంట్స్