YSRCP News :   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, స్వయంగా సీఎం జగన్‌కు సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. తనకు ఇచ్చిన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి వైదొలిగారు. స్వయం సీఎం జగన్ పిలిచి  మీరే కొనసాగాలి అని చెప్పినా ఆయన కుదరదని చెప్పి వెళ్లిపోయారు. తన నియోజకవర్గానికే పరిమితమవుతానన్నారు. అయితే సీఎం జగన్  తో బంధుత్వం ఉండటం వల్లనే ఆయన అలా ధైర్యంగా చెప్పగలిగారు కానీ ఇలా పార్టీ బాధ్యతల్లో ఉన్న చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. వీరి అసంతృప్తి ఎందుకు ? 


మంత్రి పదవులు త్యాగం చేసిన వారికి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు


సీఎం జగన్ మూడేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని మార్చారు. అందరి దగ్గర రాజీనామాలు తీసుకున్నారు కానీ సగం మందికి మళ్లీ చాన్సిచ్చారు. చాన్సివ్వలేని వారికి పార్టీ పదవులు ఇచ్చారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్ష పదవులు, రీజినల్ కోఆర్డినేటర్  పదవులు ఇచ్చారు. పదవి మాత్రమే ఉండదు కానీ.. ప్రోటోకాల్ లోపం రాదని హామీ ఇచ్చారు. అయితే వాస్తవంగా జరుగుతోంది మాత్రం వేరు. రీజనల్ కోఆర్డినేటర్లకు ఎలాంటి ప్రోటోకాల్ లభించకపోగా.. మంత్రి పదవి లేకపోవడంతో జిల్లాలో కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది. దీంతో పలువురు  మాజీ మంత్రులు తమకు అప్పగించిన బాధ్యతల నుంచి మెల్లగా వైదొలిగారు. 


గతంలోనే వైదొలిగిన పలువురు మాజీ మంత్రులు 


ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ఆశించిన మేర పనిచేయడంలేదన్న భావనతో అధినేత జగన్‌ అప్పట్లో రీజినల్‌ కో ఆర్డినేటర్లుగా నియమించిన వారిలో నుండి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని , అనీల్‌ కుమార్‌య యాదవ్‌, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌లను తప్పించి కొత్త వారికి చాన్సిచ్చారు.  మొత్తం 8 మందితో రీజి నల్‌ కోఆర్డినేటర్ల వ్యవ స్థను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఎనిమిది మంది రీజినల్ కోఆర్డినేటర్లలో బాలినేని రాజీనామా చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్ బంధువు, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాత్రం యాక్టివ్ గా ఉన్నారు. మిగిలిన వరు ఎవరూ రీజనల్ కోఆర్డినేటర్లుగా చురుకుగా ఉండటం లేదు. తమను కూడా ఆ బాధ్యతల నుంచి తప్పిస్తే బాగుండని అనుకుంటున్నారు. 


వర్గ పోరాటంతో సమస్యలు !


అధికారంలో ఉండే పార్టీలో సహజంగానే వర్గ పోరాటం ఎక్కువగా ఉంటుంది. రీజినల్ కోఆర్డినేటర్లు అందర్నీ సమన్వయం చేసుకుని పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుంది. కానీ వీరెవర మంత్రులు కాకపోవడం.. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఉన్న మంత్రులు తమ పట్టు కోసం సొంత వర్గాన్ని ప్రోత్సహిస్తూండటంతో సమస్యలు వస్తున్నాయి. అదే సమయంలో  ఎన్నికలకు కేవలం మరో ఏడాది మాత్రమే ఉన్న కారణంగా  తమ సొంత నియోజకవర్గాలనూ చూసుకోవాల్సి వస్తోంది.  దీంతో వారికి కేటాయించిన జిల్లాల్లో పూర్తిస్థాయిలో దృష్టిపెట్ట లేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల సమావేశాలు, స్థానిక సమస్యలు-నిధుల వేట, మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణ, ని న్నటి వరకూ జగనన్నే మా భవిష్యత్‌ వంటి వాటినీ సమన్వయం చేసుకోలేపోతున్నారు. ఇన్ని బాధ్యతలు ఎందుకని.. ముందు తాము గెలవడం ముఖ్యమని.. ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.