సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార, బాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్’ సినిమాలో నటిస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో భాగంగా షారుఖ్ చెన్నైకి వచ్చారు. షూటింగ్ అనంతరం మర్యాద పూర్వకంగా ఆయన నయనతార ఇంటికి వెళ్ళాడు.  కాసేపు నయన్ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. తిరిగి వెళుతుండగా కారులో కూర్చున్న షారుక్ ఖాన్ బుగ్గపై నయనతార ముద్దు పెట్టింది. పబ్లిక్ గా నయనతార షారుఖ్ కు కిస్ పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.






నయనతార ముద్దుపై నెట్టింట్లో ట్రోలింగ్


కొంత మంది ఈ వీడియోపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. పెళ్లైన మహిళ పబ్లిక్ గా ముద్దులు పెట్టడం ఏంటని విమర్శలు మొదలు పెట్టారు. అయితే, ఈ ట్రోలింగ్ పై ఇటు నయనతార, అటు షారుఖ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. స్నేహానికి, కామానికి ఉన్న తేడా తెలియని వాళ్లు కూడా సోషల్ మీడియాలో చెత్త కామెంట్లు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు.


షారుఖ్ కు ఘన స్వాగతం పలికిన అభిమానులు


అటు చెన్నైకి వెళ్లిన షారుఖ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో, కొద్ది సేపు అభిమానులతో సెల్ఫీలు దిగారు. అందరినీ నవ్వుతూ పలకరించారు. తన కారు సైడ్ నుంచి నిలబడి అభిమానులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే అట్లీ భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి షారుఖ్ అట్లి ఇంటికి వెళ్లారు. కాసేపు వాళ్ల చిన్నారితో ఆటలు ఆడుకున్నారు. 


‘జవాన్’ సినిమాతో అట్లీ బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ మూవీలో విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక రోల్స్ చేస్తున్నారు. దీపికా పదుకొణె క్యామియో రోల్ లో మెరవనున్నారు. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ‘జవాన్’ మూవీ జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.


 ఇక షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీతో పాటు రాజ్‌ కుమార్ హిరానీతో కలిసి ‘డుంకీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం తాప్సీ పన్ను హీరోయిన్ గా నటిస్తోంది.  ఇక షారుఖ్ తాజాగా ‘పఠాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా  రూ. 900 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ చిత్రంలో జాన్ అబ్రహం, దీపికా పదుకొణె, డింపుల్ కపాడియా, అశుతోష్ రానా కీలక పాత్రలు పోషించారు.  


Reda Also: లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు, అజిత్ లైఫ్ స్టైల్ చూస్తే ఆశ్యర్చపోవాల్సిందే!