మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ నుంచి కిందకు పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను నగరంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్మెంట్ అందించారు. ట్రీట్మెంట్ లో భాగంగానే ఆయనకు కాలర్ బోన్ సర్జరీ జరిగింది. 


Also Read: ఫ్యాన్స్ కు పవన్ ట్రీట్.. సెకండ్ సాంగ్ వచ్చేసిందోచ్..


యాక్సిడెంట్ తరువాత తేజు షాక్ లోకి వెళ్లిపోవడంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. శుక్రవారం సాయిధరమ్ తేజ్ పుట్టినరోజుని పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా ఆయన విషెస్ చెప్పారు. అలానే సాయి ధరమ్ తేజ్ పరిస్థితి గురించి మాట్లాడారు. 


''విజయదశమి మాత్రమే కాకుండా మా ఇంట్లో ఈరోజు మరో ప్రత్యేకమైన విశేషం ఉంది. అది ఏమిటంటే.. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సాయితేజ్‌ చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో నేడు ఇంటికి వచ్చేశాడు. ఇది తనకి పునర్జన్మ లాంటింది. మా కుటుంబం మొత్తానికి ఎంతో ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే సాయి తేజ్‌'' అంటూ రాసుకొచ్చారు చిరు. 


అలానే మెగాహీరోలు వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఇలా అందరూ తేజుకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. తేజు కోలుకున్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందంతో ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతున్నారు.