మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'పక్కా కమర్షియల్'. మారుతి దర్శకత్వం వహించారు. ఇందులో రాశీ ఖ‌న్నా (Raashi Khanna) క‌థానాయిక. ఇప్పుడీ సినిమా విడుదల తేదీ కూడా మారింది. తొలుత మార్చి 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. అయితే... మార్చి 11న 'రాధే శ్యామ్', 25న 'ఆర్ఆర్ఆర్' విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అందుకని, మే 20కు విడుదల (Pakka Commercial release postponed to May 20th from March 18th)ను వాయిదా వేశారు. అదీ కరోనా కరుణిస్తే ప్రపంచవ్యాప్తంగా మే 20న వస్తామని వెల్లడించడం విశేషం.


ఈ సినిమా కోసం 'జన్మించినా... మరణించినా... ఖర్చే ఖర్చు... పక్కా కమర్షియల్' (Pakka Commercial Title Song) అంటూ దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన గీతాన్ని ఈ రోజు విడుదల చేశారు. జాక్స్ బిజాయ్ సంగీతం అందించడంతో పాటు హేమచంద్రతో కలిసి ఆలపించారు.

'పూజలు... పునస్కారాలు... నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియలే!
దేవుడు... జీవుడు... భక్తుడు... అగరొత్తులు... అన్నీ పక్కా కమర్షియలే!
గురువులు... శిష్యులు... చదువులు... చట్టబండలు... అన్నీ పక్కా కమర్షియలే!' అంటూ గీతం సాగింది. 


యూవీ క్రియేషన్స్, జీఏ (గీతా ఆర్ట్స్) 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. 'బన్నీ' వాసు నిర్మాత. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. గతంలో గోపీచంద్‌కు జంటగా 'జిల్', 'ఆక్సిజన్' సినిమాల్లో ఆమె నటించారు. వీళ్లిద్దరి కలయికలో మూడో చిత్రమిది. ఈ సినిమాలో ఇద్దరూ లాయర్లుగా కనిపించనున్నారు. మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు యాక్షన్, కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయట.