కోలీవుడ్ స్టార్ స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'వాలిమై'. జీ స్టూడియోస్‌ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందించారు. అజిత్‌ కు ఉన్న క్రేజ్ కార‌ణంగా ఈ సినిమాను త‌మిళంలో భారీ ఎత్తున విడుద‌ల చేయాల‌నుకున్నారు. అలానే బోనీ క‌పూర్‌ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పట్టు కారణంగా హిందీలో అనువాదం చేసి విడుద‌ల చేయాల‌నుకున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నారు. ముందుగా జనవరి 13న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. 


కానీ కరోనా కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. దాదాపు అన్ని ఇండస్ట్రీలలో సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. రీసెంట్ గా ఒక్కో సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య', 'రాధేశ్యామ్' ఇలా అన్ని సినిమాలు కొత్త విడుదల తేదీలను ప్రకటించాయి. ఇప్పడు అజిత్ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 24న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 


అయితే ఫిబ్రవరి 25న 'భీమ్లానాయక్' సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు రిలీజ్ డేట్స్ ను ప్రకటించింది. ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తామని 'భీమ్లానాయక్' మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరిలో సినిమా రిలీజైతే మాత్రం అజిత్ సినిమాకి తెలుగులో పోటీ తప్పదు. పవన్ సినిమాకి ఉన్న క్రేజ్ తో పోలిస్తే డబ్బింగ్ సినిమా నిలవడం కష్టమే. మరేం జరుగుతుందో చూడాలి!