సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 'సైమా'(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డుల పురస్కారం బెంగుళూరు వేదికగా శని, ఆదివారాలు ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి సౌత్ ఇండియన్ యాక్టర్స్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. స్టార్ హీరో రణవీర్ సింగ్ ముఖ్య అతిథిగా ఈవెంట్ కి వచ్చారు. ఆయన ప్రెజన్స్ లో సైమా ఈవెంట్ చాలా సందడిగా మారింది. 


పలువురు విజేతలకు అవార్డులు ఇవ్వడంతో పాటు సౌత్ స్టార్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ బాలీవుడ్ స్టార్.. మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి స్టేజ్ పై రెండు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిద్దరి స్టైల్ అండ్ బాడీ లాంగ్వేజ్ ని ఇష్టపడే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటిది వీరిద్దరూ ఒకే స్టేజ్ పై మాస్ స్టెప్స్ వేస్తూ కనిపించడం స్పెషల్ మూమెంట్ గా నిలిచింది. 


దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ టీవీల్లో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వీరిద్దరి కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం రణవీర్ 'సర్కస్', 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


 ఇక విజయ్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతడి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అవే 'ఖుషి', 'జనగణమన'. పూరితో చేయాల్సిన 'జనగణమన' సినిమా క్యాన్సిల్ అయినట్లు సమాచారం. ఇక 'ఖుషి' సినిమా కొత్త షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. విజయ్ పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.


కశ్మీర్ నేపథ్యంలో రూపొందుతోన్న ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నారు. మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 


దిల్ రాజుతో విజయ్ దేవరకొండ సినిమా:


నిర్మాత దిల్ రాజు విజయ్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' తరువాత విజయ్ కి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. అప్పటినుంచి ఈ బ్యానర్ లో ఓ సినిమా బాకీ ఉండిపోయారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు దిల్ రాజుతో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో విజయ్ కి మంచి కథను సెట్ చేసే పనిలో పడ్డారు దిల్ రాజు.


అశ్వనీదత్ తో మరో సినిమా:


అగ్ర నిర్మాత అశ్వనీదత్.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే సరైన కథ మాత్రం దొరకలేదు. ఇప్పుడు కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సౌత్ లో కూడా పాపులర్ అయిన రాజ్ అండ్ డీకే దర్శకులు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇటీవల వారు చెప్పిన కథ విజయ్ కి నచ్చింది. అదే కథ అశ్వనీదత్ దగ్గరకు వెళ్లింది. ఆయనకు కూడా నచ్చడంతో.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ కథ దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.