నటుడు కృష్ణంరాజు చివరిచూపు కోసం అభిమానులు తరలివస్తున్నారు. ఆయన అంత్యక్రియలను మొయినాబాద్ సమీపంలోని కనకమామిడిలో ఉన్న ఫామ్ హౌస్ లో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆయన అంతిమయాత్ర మొదలైంది. కృష్ణంరాజు ఇంటి నుంచి ఫామ్ హౌస్ కు పార్థివదేహాన్ని తరలించే సమయంలో ఆయన భార్య శ్యామలా దేవి వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. 

 

మన కట్టుబాట్ల ప్రకారం.. పాడె మోయడానికి మహిళలు ముందుకు రాకూడదు. కానీ శ్యామలాదేవి మాత్రం తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కృష్ణంరాజుకి శ్యామలాదేవికి మధ్య మంచి అనుబంధం ఉండేది. ఎక్కడికి వెళ్లినా.. ఇద్దరూ కలిసే వెళ్లేవారు. కృష్ణంరాజు అంటే శ్యామలాదేవికి ఎంతో ప్రేమ. తన లైఫ్ లో ఆయన పెద్ద గిఫ్ట్ అని చెబుతుంటారామె. అటువంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడం ఆమె తట్టుకోలేకపోతున్నారు. 

 

కృష్ణం రాజు జనవరి 20, 1940న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయనది విజయనగర సామ్రాజ్య వారసుల కుటుంబం. ఆయన అసలు పేరు శ్రీ ఉప్పలపాటి చిన వెంకట కృష్ణం రాజు. సినిమాల్లోకి వచ్చినప్పుడు... ఇంటి పేరులో 'శ్రీ', తల్లిదండ్రులు పెట్టిన పేరులో 'చిన వెంకట' పదాలను ఆయన తీసేశారు. ఉప్పలపాటి కృష్ణం రాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
 
కృష్ణంరాజు విద్యాభ్యాసం మొగల్తూరులో మొదలైంది. ఎనిమిదో తరగతి వరకూ అక్కడ చదువుకున్నారు. ఆ తర్వాత నర్సాపురం టైలర్ హైస్కూల్‌లో చేరారు. మళ్ళీ అక్కడ ఎనిమిదో తరగతిలో చేరారు. తొమ్మిది వరకు చదివారు. అల్లరి పెరగడం, బూతులు అలవాటు కావడంతో కొన్నాళ్ళు కాకినాడ పంపించారు. అక్కడ ఎస్.ఎస్.ఎల్.సి తప్పారు. దాంతో మళ్ళీ నర్సాపురం టైలర్ స్కూల్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత వై.ఎన్.ఆర్. కాలేజీలో చేరారు. అందులో పి.యు.సి. తప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ భద్రుకా కాలేజీ ఆఫ్ కామర్స్‌లో చేరారు. పి.యు.సి పాస్ అయ్యాక బీకామ్ చేశారు.


కాలేజీ రోజుల్లో కృష్ణం రాజు అక్కినేని నాగేశ్వరరావు అభిమాని. 'సువర్ణ సుందరి'ని సుమారు 30 సార్లు చూశానని ఆయన ఒకసారి చెప్పారు. బీకామ్ చదువుతూ... 'ఆంధ్ర రత్న' పత్రికలో కృష్ణం రాజు జర్నలిస్టుగా చేశారు. ఆ పేపర్ ఆయనకు వరసకు బాబాయ్ అయ్యే మూర్తిరాజుది. అప్పుడు ఒకసారి అబిడ్స్ సెంటర్‌లో కాఫీ తాగుతున్న కృష్ణం రాజు దగ్గరకు వచ్చి 'అక్కా చెల్లెలు' తీసిన పద్మనాభ రావు 'సినిమాల్లో నటిస్తారా?' అని అడగటం, స్నేహితులు ప్రోత్సహించడంతో మద్రాస్ చేరుకున్నారు. ఆ సినిమా ప్రారంభం కాలేదు. వెనక్కి తిరిగి రావడానికి నామోషీగా ఫీలైన కృష్ణం రాజు... మద్రాస్ నగరంలో ఉండి అవకాశాల కోసం ప్రయత్నించారు. 'తేనె మనసులు' సినిమాకు ఆడిషన్ ఇచ్చారు. అందులో కృష్ణకు అవకాశం వస్తే... కృష్ణంరాజు రిజెక్ట్ అయ్యారు. అయినా అలా ప్రయత్నిస్తూ ఉన్నారు.

మద్రాస్ నగరంలో కృష్ణం రాజుకు ప్రత్యగాత్మ పరిచయమయ్యారు. ఆయనే 'చిలక గోరింక'తో కృష్ణం రాజును హీరోగా పరిచయం చేశారు. 1966లో విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో చాలా నిరాశ చెందారు. కొన్నాళ్ళు నటనకు విరామం ఇచ్చారు. నటుడు సీహెచ్ నారాయణరావు వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. నటన గురించి పలువురు రాసిన పుస్తకాలు చదివారు. మధ్యలో ఎన్ని అవకాశాలు వచ్చినా చేయలేదు. వాటిని వదులుకున్నారు.

ఆ తరువాత విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకులను అలరించిన కృష్ణం రాజు... కథానాయకుడిగా మళ్ళీ తెలుగు తెరపై అడుగు పెట్టడం కోసం నిర్మాణంలోకి ప్రవేశించారు. సొంత నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు.

నిర్మాతగా కృష్ణం రాజు తొలి సినిమా 'కృష్ణవేణి'. గోపీకృష్ణా మూవీస్ సంస్థ స్థాపించి ఆయన నిర్మించిన మొదటి చిత్రమది. నటుడిగా ఆయనకు మంచి పేరు తీసుకు వచ్చింది. అయితే... అది లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఆ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఆ తర్వాత 'భక్త కన్నప్ప' చేశారు. ఆ తర్వాత కృష్ణం రాజు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. నటుడిగా పేరు, వరుస అవకాశాలు తీసుకు వచ్చింది 'భక్త కన్నప్ప'.