బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రణబీర్-అలియా జంట ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తండ్రి అయిన తర్వాత రణబీర్ మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ కార్యక్రమానికి హాజరయ్యారు. సౌదీ అరేబియాలో రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా వెరైటీ ఇంటర్నేషనల్ వాన్ గార్డ్ యాక్టర్ అవార్డును అందుకున్నారు రణవీర్. ఈ కార్యక్రమంలో ఓ పాకిస్తానీ సినిమా గురించి రణవీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


ఈ ఈవెంట్ లో రణబీర్ మాట్లాడుతూ.. పొరుగు దేశాలకు చెందిన నటీనటులతో పనిచేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. కళలకు, కళాకారులకు సరిహద్దులు ఉండవన్న ఆయన సౌదీ అరేబియా వంటి దేశ పరిశ్రమలతోనూ పనిచేయాలనే ఆలోచన ఉందని, అవకాశం ఉంటే ఒక చిత్రానికి సైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో పాకిస్తానీ చిత్రం 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్' సినిమా భారీ విజయం సాధించడం పట్ల పాకిస్తాన్ చిత్ర పరిశ్రమకు రణబీర్ అభినందనలు తెలియజేశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ లలో ఈ సినిమా కూడా ఒకటి అని అన్నారు. అవకాశం ఉంటే పాకిస్తాన్ చిత్ర బృందంతోనూ పనిచేయడానికి ఇష్టపడతానని అన్నారు రణబీర్.


ఇక ఈ ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ సినిమా ఒక పంజాబీ యాక్షన్ డ్రామా. లసారి ఫిల్మ్స్, ఎన్ సైక్లోమీడియా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. బిలాల్ లస్హరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ కథను నాసిర్ అదీప్ ఆధారంగా రూపొందించారు. ఇందులో హంజా అలీ అబ్బాసీ, హుమైమా మాలిక్, మహిరా ఖాన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. మౌలా జట్ అనే పాత్రలో నూరి నట్ పోషించాడు. ఈ చిత్రం అక్టోబర్ 12, 2022న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాను పాకిస్తాన్ లో విడుదల చేయగా అక్కడ ఊహించని విధంగా భారీ హిట్ ను అందుకుంది. ఒక్క పాకిస్తాన్ లోనే ఈ సినిమా రూ.100 కోట్లు వసూళ్లు సాధించి చరిత్రను తిరగరాసింది. పాకిస్తాన్ లో ఇన్నేళ్లూ రూ.100 కోట్లు దాటిన సినిమా ఏదీ లేదు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఆ జాబితాను ప్రారంభించిందని అక్కడి సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  


ఇక రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ యేడాది భారీ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్ లోకి చేరింది. దీని తర్వాత రణబీర్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘హోళీ’ సినిమా 2023 లో విడుదల కాబోతోంది. దీని తర్వాత త్వరలోనే అలియా భట్ తో మళ్లీ జత కట్టనున్నారు రణబీర్. దీనితో పాటు ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ వంగాతో ‘యానిమల్’ సినిమాలో నటించనున్నారు.


Read Also: ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ మహారాజా లుక్ ఇదే, ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయిందిగా!