ఇటీవల 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విజయ్ దేవరకొండ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. దాదాపు రూ.60 కోట్లకు పైగా నష్టాలొచ్చినట్లు సమాచారం. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు విజయ్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెడుతున్నారు. విజయ్ లిస్ట్ లో ఎన్ని ప్లాప్ సినిమాలున్నా.. అతడితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు. 


ఇప్పటికే అగ్ర నిర్మాత అశ్వనీదత్.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే సరైన కథ మాత్రం దొరకలేదు. ఇప్పుడు కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సౌత్ లో కూడా పాపులర్ అయిన రాజ్ అండ్ డీకే దర్శకులు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇటీవల వారు చెప్పిన కథ విజయ్ కి నచ్చింది. అదే కథ అశ్వనీదత్ దగ్గరకు వెళ్లింది. 


ఆయనకు కూడా నచ్చడంతో.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ కథ దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. రాజ్, డీకే తెలుగువాళ్లే. చిత్తూరు జిల్లాకు చెందిన వీరు బాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు సౌత్ లో కూడా సత్తా చాటాలని చూస్తున్నారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని కూడా సంప్రదించారు. ప్రస్తుతం మహేష్ తో ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉంది. దానికంటే ముందు విజయ్ దేవరకొండతో సినిమా సెట్ అయింది. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించనున్నారు. 


దిల్ రాజుతో విజయ్ దేవరకొండ సినిమా:


నిర్మాత దిల్ రాజు విజయ్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' తరువాత విజయ్ కి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. అప్పటినుంచి ఈ బ్యానర్ లో ఓ సినిమా బాకీ ఉండిపోయారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు దిల్ రాజుతో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో విజయ్ కి మంచి కథను సెట్ చేసే పనిలో పడ్డారు దిల్ రాజు.


తన కాంపౌండ్ లో ఉన్న దర్శకులతో దిల్ రాజు మీటింగ్స్ పెడుతున్నారు. ఎవరి దగ్గర విజయ్ కి సరిపడా కథ ఉంటే.. వాళ్లతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అవే 'ఖుషి', 'జనగణమన'. 'జనగణమన' క్యాన్సిల్ అయిందని టాక్. ఇక 'ఖుషి' సినిమా కొత్త షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. విజయ్ పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 


కశ్మీర్ నేపథ్యంలో రూపొందుతోన్న ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నారు. మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.


Also Read : 'బ్రహ్మాస్త్ర' ఫ్లాప్‌ - ఐనాక్స్, పీవీఆర్‌కు 800 కోట్లు లాస్