దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్ర రావు (K Raghavendra Rao) మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్నారు. 'ఓం నమో వేంకటేశాయ' తర్వాత ఆయన దర్శకత్వంలో మరో సినిమా రాలేదు. అయితే... ఆయన నిర్మాణ సంస్థ నుంచి, ఆయన సమర్పణ - దర్శకత్వ పర్యవేక్షణలో కొన్ని చిత్రాలు వచ్చాయి. కొంత విరామం తర్వాత, మళ్ళీ ఆయన మెగా ఫోన్ పడుతున్నారు. 


తుమ్మలపల్లి రామ సత్యనారాయణ (Tummalapalli Rama Satyanarayana) కు చెందిన భీమవరం టాకీస్ నిర్మాణంలో దర్శ కేంద్రుడి తాజా సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి 'శ్రీవల్లి కళ్యాణం' (Sri Valli Kalyanam Telugu Movie) టైటిల్ ఖరారు చేశారు. సెప్టెంబర్ 10న తుమ్మలపల్లి రామ సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. 


'శ్రీవల్లి కళ్యాణం' సినిమా గురించి మాట్లాడుతూ ''నిర్మాతగా నా జీవిత ఆశయం నూరవ చిత్రం... అదీ దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గారితో 'శ్రీవల్లి కళ్యాణం. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతోంది. త్వరలో మొదలు పెట్టి, వచ్చే ఏడాది విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం'' అని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అన్నారు. 


కెరీర్ గురించి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ ''సుమన్, రవళి జంటగా రూపొందిన 'ఎస్.పి. సింహా' సినిమాతో 2004లో నిర్మాతగా నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ 'ఐస్ క్రీమ్ పార్ట్ ఒన్', 'ఐస్ క్రీమ్ పార్ట్ టు'లతో వేగం అందుకుంది. స్ట్రెయిట్ సినిమాలు మాత్రమే కాదు... సూర్య 'ట్రాఫిక్', అజిత్, తమన్నా భాటియా జంటగా నటించిన 'వీరుడొక్కడే', కిచ్చా సుదీప్, జగపతి బాబు కలయికలో 'బచ్చన్', ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా రూపొందిన 'శీను గాడి లవ్ స్టోరీ' తదితర అనువాద చిత్రాలను తెలుగులో విడుదల చేశా. అవి నాకు లాభాలతో పాటు ఆత్మ సంతృప్తినీ ఇచ్చాయి'' అని చెప్పారు. 


Also Read : 'బ్రహ్మాస్త్ర' రివ్యూ : బాలీవుడ్‌ను ఫ్లాపుల నుంచి బయట పడేస్తుందా? లేదా?


ఈ ఏడాది యండమూరి దర్శకత్వంలో ప్రముఖ నటుడు సునీల్, 'బిగ్ బాస్' కౌశల్ (Bigg Boss Kaushal)తో 'అతడు ఆమె ప్రియుడు', జాతీయ పురస్కార గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో 'జాతీయ రహదారి' చిత్రాలను తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించారు.


రాఘవేంద్ర రావు సమర్పణలో ఇటీవల 'వాంటెడ్ పండుగాడ్' సినిమా వచ్చింది. అందులో అనసూయ భరద్వాజ్, సునీల్, 'వెన్నెల' కిశోర్, 'సుడిగాలి' సుధీర్, నిత్యా శెట్టి, బ్రహ్మానందం, రఘుబాబు, అనంత్, 'పుష్ప' జగదీశ్, హేమ, 'షకలక' శంకర్ తదితరులు నటించారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. అయితే, పాటలు దర్శ కేంద్రుడి శైలిలో ఉన్నాయని పేరు వచ్చింది. ఆయన దర్శకత్వంలో సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. భక్తి ప్రధాన సినిమా కాకుండా... కమర్షియల్ సినిమా వస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని రాఘవేంద్రుడి అభిమానుల నమ్మకం. 


Also Read : తెలుగులో టైటిల్ మార్చిన శింబు, గౌతమ్ మీనన్