తొలి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘ది కేరళ స్టోరీ’సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా అనుకున్నట్లుగానే ఇవాళ(మే 5న) విడుదల అయ్యింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో సినిమాని నిలిపివేయాలని నిరసనలు జరుగుతున్నా, బందోబస్తు నడుమ సినిమాను ప్రదర్శిస్తున్నారు. కేరళలో పలు సినిమా థియేటర్ల ముందు అధికార, ప్రతిపక్ష నేతలు నిరసనలు చేపట్టారు. సినిమా ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.


‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనలను రద్దు చేసిన PVR సినిమాస్


‘ది కేరళ స్టోరీ’ సినిమాపై తీవ్ర వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో  PVR సినిమాస్ కీలక నిర్ణయం తీసకుంది. కొచ్చిలోని తమ థియేటర్లలో సినిమా ప్రదర్శనను  నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఒబెరాన్ మాల్ తో పాటు, లులూ మాల్‌లలో ప్రదర్శనను ప్లాన్ చేసింది. నిరసనల నేపథ్యంలో రెండు చోట్లా ప్రదర్శన రద్దు చేసింది. BookMyShow ద్వారా ఈ సినిమా కోసం టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు షో క్యాన్సిల్ చేస్తున్నట్లు మెసేజ్ లు పంపించారు. PVR నుంచి అధికారికంగా సినిమా ప్రదర్శన రద్దును ధృవీకరించినప్పటికీ, ఎందుకు రద్దు చేస్తున్నారు? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.


‘ది కేరళ స్టోరీ’కథ ఏంటంటే?


‘ది కేరళ స్టోరీ’ సినిమాను డైరెక్టర్ సుదీప్తోసేన్‌ రూపొందించారు. కేరళలో గత కొద్ది సంవత్సరాలుగా 32 వేల మంది యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ వారు ఏమయ్యారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. కేరళకు చెందిన నలుగురు యువతులు బలవంతంగా మతం మారి, ఆ తర్వాత వాళ్లు ఐసిస్ లో చేరడం ఈ సినిమాలో చూపిస్తారు. తప్పిపోయిన అమ్మాయిలు, మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్ తో పాటు ఇతర దేశాల్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నారని ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా, విపుల్‌ అమృత్‌ లాల్‌ షా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


సినిమాను నిషేధించాలంటున్న అధికార, విపక్షాలు   


‘ది కేరళ స్టోరీ’ సినిమాను రాష్ట్రంలో విడుదల కాకుండా నిషేధించాలని అక్కడి అధికార, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమా ట్రైలర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతపరమైన  ద్వేషాన్ని సృష్టించేందుకు ఈ సినిమాను తీసినట్లు అర్థం అవుతుందని ఆరోపించారు . రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాయని,  వారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలను  విపక్ష కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది.  సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది.  క్రిస్టియన్‌ అసోసియేషన్‌(సీఏఎస్‌ఏ), బీజేపీ లాంటి పార్టీలో ఈ సినిమా విడుదలకు సోప్టు చేస్తున్నాయి. ‘లవ్‌ జిహాద్‌’తో నాశనం అయిన ఎన్నో కేరళ కుటుంబాల కథే ఈ సినిమా అని సీఏఎస్‌ఏ అభిప్రాయపడింది.


ఏడేళ్లు రీసెర్చ్ చేసి ఈ సినిమా తీశాం- డైరెక్టర్ సుదీప్తో సేన్


ఈ సినిమా తీయడానికి చాలా రీసెర్చ్ చేసినట్లు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తో సేన్ తెలిపారు. దాదాపు ఏడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డట్టు వివరించారు. “అమ్మాయిల మిస్సింగ్ కథ విన్నప్పుడు ఇలాంటివి మన దేశంలో కూడా జరుగుతాయా అనుకున్నాను. కానీ, రీసెర్చ్ చేశాక నిజాలు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. దీని గురించి అంతా తెలుసుకున్నాకే సినిమా తీశాను” అని తెలిపారు.  


Read Also: ఆస్కార్‌తో పాటు 8 అంతర్జాతీయ అవార్డులపై గురి, 'తంగళన్' టీమ్ టార్గెట్ మామూలుగా లేదుగా!