మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన టైలర్‌ కన్హయ్య లాల్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. రాజస్థాన్ ఉదయ్‌పుర్‌ మాల్దాస్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఉగ్ర సంస్థ ఐసిస్ ముష్కరులను తలపించేలా టైలర్ గొంతు కోసి క్రూరంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  భాజపా సస్పెండ్‌ చేసిన నుపుర్‌ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామని హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలానే చేస్తామని హెచ్చరించారు.


ఈ దారుణానికి తెగబడిన నిందితులను రియాజ్‌ అక్తర్‌, గౌస్‌ మొహమ్మద్‌గా పోలీసులు గుర్తించారు. రియాజ్‌.. టైలర్ గొంతు కోయగా, గౌస్‌ దీనిని అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ దారుణ ఘటనపై హీరోయిన్ ప్రణీత స్పందించింది. 


ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టింది. 'నేను ఉదయ్‌పుర్‌ వీడియో చూడకపోతే బాగుండేది. అదొక టెర్రర్. బ్యాక్‌గ్రౌండ్‌లోని అరుపులు నా మైండ్ లో ఇంకా తిరుగుతున్నాయి. చాలా కాలం పాటు ఈ ఇన్సిడెంట్ వెంటాడుతూనే ఉంటుంది' అంటూ రాసుకొచ్చింది. అలానే ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫొటో షేర్ చేసింది. అందులో ఒక ప్లాంక్ పట్టుకొని నిల్చుంది. దానిపై 'హిందూ లైవ్స్ మేటర్' (హిందువుల ప్రాణాలు ముఖ్యం) అని రాసి ఉంది. 


Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర


Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి