పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ 'హరిహర వీరమల్లు' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 2021 ఆరంభంలో సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా గతేడాది ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టారు. తొలిసారి పవన్ కళ్యాణ్ చారిత్రక నేపథ్యమున్న సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా సెట్స్ లో లెజండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని కలిశారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. 


ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉందంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ కర్రసాము ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. వీడియో చివర్లో ఆయన ఫీట్ అదిరిపోయింది. పవన్ ఫ్యాన్స్ కు ఈ వీడియో మంచి ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. 


ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. కథ ప్రకారం.. ఆమె రాకుమారి పాత్రలో కనిపించనుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ  భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాదే సినిమాను పూర్తి చేసి 2023 సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.