సాధారణంగా ఫిల్మ్ మేకర్స్ తమ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత కొత్త సినిమాలను ప్రకటిస్తారు. స్టార్ హీరోలు కూడా ఈ రోజుల్లో కొత్త సినిమాలను అంత త్వరగా కమిట్ కావడం లేదు. తాము చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాతే, కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తున్నారు. అయితే, మహేష్ బాబు అభిమానులకు కొంతకాలంగా వరుస బెట్టి ఝలక్ లు ఇస్తున్నారు ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఉన్న సినిమాలు పూర్తి చేయకుండానే కొత్త సినిమాలు ప్రకటించడం పట్ల కలవరపడుతున్నారు.


మహేష్ ఫ్యాన్స్ ను కలవర పెడుతున్న త్రివిక్రమ్


మహేష్ బాబుతో కలిసి త్రివిక్రమ్ #SSMB28 సినిమా మొదలు పెట్టారు. ఆ తర్వాత ఈ సినిమాకు ‘గుంటూరు కారం’ అని టైటిల్ పెట్టారు. ఈ సంవత్సరం జనవరి ప్రారంభంలో మొదటిసారి ఈ సినిమా వాయిదా పడిన సమయంలో, దర్శకుడు త్రివిక్రమ్ మరో చిత్రానికి ఓకే చెప్పారు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వినోదయ సీతం’ తెలుగు రీమేక్‌కి స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్ అందించారు. తాజాగా ఈ సినిమాకు ‘BRO’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనళ్లుడు సాయి ధరమ్ నటించిన ఈ చిత్రం, త్రివిక్రమ్ దర్శకత్వ నిర్దేశంలోనే కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాటల మాంత్రికుడు ‘గుంటూరు కారం’ కోసం సమయం సరిగా కేటాయించడం లేదని భావించిన మహేష్ అభిమానులకు, పవన్ కల్యాణ్ సినిమా ఒప్పుకోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. తాజాగా త్రివిక్రమ్ రెండు సినిమాలు చేతిలో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ జరుగుతుండగానే, గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంస్థలు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఈ కొత్త చిత్రాన్ని ప్రకటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ‘గుంటూరు కారం’, ‘పుష్ప 2’ విడుదల తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి నుంచే త్రివిక్రమ్ ఈ పాన్-ఇండియా సినిమా స్క్రిప్ట్ వర్క్‌ పై తన ఫోకస్ మళ్లిస్తారేమోనని మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


అనుకున్న సమయానికి మహేష్ మూవీ విడుదలయ్యేనా?


ఇప్పటికే ‘గుంటూరు కారం’ షూటింగ్ పలు కారణాలతో రెండుసార్లు వాయిదా పడింది. త్రివిక్రమ్ యొక్క ఈ కొత్త ప్రాజెక్ట్‌ లు మరింత ఆటంకం కలిగిస్తాయేమోనని టెన్షన్ పడుతున్నారు.  ఇలా షూటింగ్ వాయిదా పడితే సినిమా అనుకున్న సమయానికి విడుదల అవ్వడం కష్టమే అని ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇప్పటికే మూవీ యూనిట్ ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, అనుకున్న  సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అటు 'గుంటూరు కారం'లో తొలుత పూజా హెగ్డేను ఓ కథానాయికగా ఎంపిక చేశారు. డేట్స్ కుదరక ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.  పూజకు బదులు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్టు తొలుత వార్తలు వచ్చాయి.  అయితే, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్దుల్లా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


Read Also: నేను పడక గదిలో కూడా అలాగే ఉంటా - కంగనా షాకింగ్ కామెంట్స్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial