పోలవరం ప్రాజెక్టు విషయంలో సోమవారం కీలక సమావేశం జరిగింది. జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ ఆధ్వర్యంలో జరిగిన భేటీ వాడీవేడిగా సాగినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి  కేంద్ర మంత్రి ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరామ్‌, కేంద్ర జలసంఘం ఛైర్మన్‌, నిజనిర్ధారణ కమిటీ ఛైర్మన్‌ పాండ్యా, ఇతర సభ్యులు, ఏపీ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌, వ్యాప్కోస్‌ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. 


ఈ మధ్య కుంగిపోయిన గైడ్‌బండ్‌పై కేంద్రమంత్రి ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటని అధికారులను ప్రశ్నిస్తే ఎవరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఒకరిపై ఒకరు నెట్టుకొనే ప్రయత్నం చేసినట్టు టాక్. ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి దీనిపై నిజాలు నిగ్గుతేల్చేందుకు కేంద్ర మంత్రి ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరామ్‌ ఆధ్వర్యంలో మరో కమిటీ వేశారు. 


గైడ్‌బండ్‌ కుంగిన అంశంపై వెదిరె శ్రీరామ్‌ ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఆదివారం సమావేశం కానుంది. ఈ భేటీకి పోలవరంతో సంబంధం ఉన్న అన్ని విభాగాలు హాజరుకావాల్సిందేనని సమాచారం ఇచ్చారు. ఎవరూ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి కూడా వీల్లేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై నిజనిర్ధారణ కమిటీ వేశారు. ఇంతవరకు ఆకమిటీ తన పూర్తి స్థాయి రిపోర్టును సమర్పించలేదు. అందుకే ఇప్పుడు కేంద్రమంత్రి జోక్యం చేసుకొని మరో కమిటీ ఏర్పాటు చేసినట్టు సమాచారం. 


పోలవరం తొలిదశ పూర్తికి అవసరమైన 17,148 కోట్ల రూపాయల మంజూరు సంబంధించిన ప్రతిపాదనలు జులై 31 లోపు పంపించాలని అధికారులను ఆదేశించారు గజేంద్రసింగ్ షెకావత్‌. ఇప్పటికే తొలిదశ పూర్తికి అయ్యే 12,911.15 కోట్ల మంజూరుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్పుడు 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోకి మరో 36 గ్రామాలు వస్తున్నాయి. దీంతో వారి కోసం అయ్యే వ్యయంతో తొలిదశకు 17,148 కోట్లు ఖర్చు అవుతుందని ఏపీ అధికారులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరగా ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. 


డయాఫ్రమ్‌ వాల్‌ అంశంపై కూడా చర్చ నడిచింది. డయాఫ్రమ్ వాల్‌ దెబ్బతిన్న చోట్ల సరి చేస్తే 400 కోట్లు ఖర్చు అవుతుందని గ్యాప్‌ -2లో కొత్తది నిర్మిస్తే 600 కోట్లు వ్యయం అవుతందని అధికారులు కేంద్రమంత్రికి తెలియజేశారు. ఈ అంశంపై సోమవారంలోపు నిర్ణయాన్ని తెలియజేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను ఆదేశించారు మంత్రి. స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ను కూడా స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ అమలును మరో ఏడాదిపాటు నిలుపుదల చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పోలవరం పనులకు మరో ఏడాది ఆటంకం లేకుండా చేసింది. 


Also Read: హామీలు నిజంగా అమలుచేస్తే, ఆ కార్యక్రమాలు ఎందుకు? సీఎం జగన్ కు జనసేన సూటిప్రశ్న


Also Read: జులై 28న ఛలో ఢిల్లీతో మరో పోరాటం, సీఎం జగన్ సైతం రావాలని బైరెడ్డి పిలుపు


                                                       Join Us on Telegram: https://t.me/abpdesamofficial