Malli Pelli Movie: సినీ నటుడు నరేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా ఓటీటీ రిలీజ్ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఈ మూవీలో నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ మే 23న థియేటర్లలో విడుదలైంది. నరేష్ ఆయన నిజ జీవితంలో జరిగిన వ్యక్తిగత వ్యవహారాల ఆధారంగా సినిమా తీశారని అప్పట్లో ఆయన భార్య రమ్య రఘుపతి ఆరోపించారు. ఈ మూవీను థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా స్టే ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. అయితే తర్వాత మూవీకు క్లియరన్స్ రావడంతో థియేటర్లలో విడుదలైంది. తర్వాత మూవీను ఓటీటీలో కూడా విడుదల చేయకుండా ఆపాలని మరోసారి రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసుతో సంబంధం లేకుండా ‘ఆహా’ ఓటీటీలో మూవీని స్ట్రీమింగ్ చేశారు. అయితే, ముందుగా ఒప్పందం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రం మూవీ స్ట్రీమింగ్ కావడం లేదు.


‘మళ్లీ పెళ్లి’ కేసును కొట్టేసిన కోర్టు


నరేష్, పవిత్ర లోకేష్ కలిసి నటించిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఈ మూవీను ఓటీటీ విడుదల చేయకుండా నిలిపివేయాలని బెంగళూరు లోని సిటీ సివిల్ కోర్టు లో పిటిషన్ ను దాఖలు చేసింది. సినిమాలో తన పాత్రను నెగిటివ్ గా చూపించారని, తన పరువుకు భంగం కలిగేలా చూపించారని పిటిషన్ లో పేర్కొంది. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ కేసును కొట్టివేసింది. ‘మ‌ళ్లీ పెళ్లి’ క‌థ పూర్తిగా క‌ల్పిత‌మ‌ని కోర్టు నిర్ధారించింది. సినిమా విడుద‌ల‌కు వ్య‌తిరేకంగా ర‌మ్య ర‌ఘుప‌తి చెప్పిన కార‌ణాలు బ‌లంగా లేక‌పోవ‌డంతో ఆమె దాఖలు చేసిన పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. అయితే ఒకసారి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇచ్చిన త‌ర్వాత సినిమా విడుద‌ల‌ను నిల‌పివేసే హ‌క్కు ప్రైవేటు వ్య‌క్తుల‌కు లేద‌ని కోర్టు పేర్కొంది. ఈ మూవీ ఓటీటీ, శాటిలైట్ లలో సినిమా ప్రదర్శించుకోవచ్చని కోర్టు తెలిపింది. దీనికి ఎలాంటి అడ్డంకులు లేవని పేర్కొంది. 


ర‌మ్య ర‌ఘుప‌తిపై నిషేధం విధించిన కోర్టు


‘మళ్లీ పెళ్లి’ ఓటీటీ విడుదలపై వేసిన పిటిషన్ ను కొట్టివేయడమే కాకుండా రమ్య రఘుపతి పై నిషేధం కూడా విధించింది కోర్టు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలోని నరేష్ నివాసానికి కూడా వెళ్లడం పట్ల నిషేదాన్ని విధించింది కోర్టు. ఈ మేరకు ఆమె రాకపోకలపై నిషేధం విధించాలంటూ వేసిన ధావాను కోర్టు స్వీకరించింది.


ఆరేళ్ళుగా కొనసాగుతున్న వివాదం


నటుడు నరేష్ రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురం తర్వాత మధ్య వివాదాలు మొదలైయ్యాయి. ముఖ్యంగా నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సన్నిహితంగా ఉంటుందనే వార్తలు రావడంతో వీరి మధ్య వివాదం మరింత ముదిరింది. అయితే ఓ రోజు నరేష్, పవిత్ర హోటల్ రూమ్ లో కనిపించడంతో నరేష్, పవిత్రలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రమ్య రఘుపతి. అప్పటి నుంచి పలు సార్లు వీరి మధ్య పోలీస్ కేసులు నడిచాయి. దీంతో ఈ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాశంగా మారింది. ఇప్పుడు తాజాగా రమ్య రఘుపతి వేసిన పెట్టిన కేసును కొట్టివేయడంతో మరోసారి వీరి వ్యవహారంపై చర్చ మొదలైంది. 


Also Read: ‘స్కంద’ ఫస్ట్ సింగిల్ సాంగ్ - డ్యాన్స్‌తో అదరగొట్టిన రామ్, శ్రీలీల!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial