ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్‌తోనే ఉంటానని ఆయన తల్లి విజయ నిర్మలకు మాటిచ్చానని, దానికి కట్టుబడి ఉంటానని ప్రముఖ సినీ నటుడు నరేష్ భార్య రమ్య రఘుపతి అన్నారు. చివరి రోజుల్లో విజయ నిర్మల తన దగ్గర మాట తీసుకుందని పేర్కొన్నారు. నరేష్, పవిత్ర లోకేష్‌ల వివాదం గురించి ఆవిడ మాట్లాడారు.


నరేష్ జీవితంలో ఎంతో మంది మహిళలు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వేరే ఆడవాళ్లతో సంబంధాలు పెట్టుకుని, దొరికిపోయిన తర్వాత ఇంకెప్పుడూ అలా చేయనని అంటారని, కానీ కొన్నాళ్లకు షరా మామూలేనని రమ్య చెప్పుకొచ్చారు.


హైదరాబాద్‌లో ఉన్నప్పుడు పవిత్ర లోకేష్‌ను కలిశారా అన్న ప్రశ్నకు... ఈ రూమర్స్ రావడానికి చాలా కాలం ముందు ఒకసారి ఇంటికి వచ్చారని, ఆవిడది కూడా కర్ణాటకనే కావడం వల్ల ఇంట్లో కూర్చోబెట్టి భోజనం కూడా పెట్టానని రమ్య తెలిపారు.


నరేష్‌కు రమ్య ఇప్పటికే విడాకులు ఇచ్చేసినట్లు వస్తున్న వార్తలపై కూడా రమ్య స్పందించారు. డైవోర్స్ అనేది చాలా పెద్ద లీగల్ ప్రాసెస్ అని, దానికి చాలా సమయం పడుతుందన్నారు. జనవరిలో నరేష్ కేసు పెట్టారని, అప్పుడు తాను ఆ ఇంట్లోనే ఉన్నానని, నోటీసులు తన వరకు రాకుండా గేటు దగ్గర నుంచే వెనక్కి పంపించారని తెలిపారు.


జూన్‌లో దేవుడి దయ వల్ల పోస్టు మాస్టర్ తన నంబర్‌కు కాల్ చేసి చాలా సమన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఆ కోర్టు సమన్లు అన్నీ బెంగళూరు అడ్రస్‌కు పంపమని తాను కోరానని, వచ్చిన సమన్లు చూశాకనే అవి విడాకుల సమన్లు అని తెలిసిందన్నారు. దీనిపై తమ లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నామని, త్వరలో దీనిపై స్పందిస్తామని తెలిపారు.



Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?


Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ