నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్' షో మొదటి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్ తో ఈ సీజన్ కి గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని 'ఆహా' సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ షోకి మహేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నారనే విషయం ఇదివరకే లీకైంది. బాలయ్య-మహేష్ బాబు ఫొటోలు కూడా బయటకొచ్చాయి. ఇప్పుడు ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు. 



ఇప్పటివరకు ఈ షోకి సంబంధించి తొమ్మిది ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. మోహన్ బాబు, నాని, అనిల్ రావిపూడి, బ్రహ్మానందం, రవితేజ, రాజమౌళి, 'లైగర్' టీమ్, 'పుష్ప' టీమ్ ఇలా చాలా మంది స్టార్లు వచ్చారు. ఇప్పుడు మహేష్ బాబు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు తన పిల్లలు, భార్య గురించి మాట్లాడారు. అలానే తనకు సైటైర్లు వేయడంలో టైమింగ్ ఉంటుందని చెప్పి నవ్వించారు.

 

'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఓ సంఘటనను బాలకృష్ణతో షేర్ చేసుకున్నారు. సీరియస్ గా డైలాగ్స్ చెబుతుంటే.. ఓ లేడీ మాత్రం గేమ్ ఆడుకుంటుందని.. ఆమె వైపు చూసి ఆపండమ్మా అని చెప్పానని.. మీరు గనుక ఉంటే మైక్ విసిరేసేవాళ్లు అంటూ బాలయ్యతో అన్నారు మహేష్. ఇక ప్రోమో చివర్లో బాలయ్య డైలాగ్ కి ఒక సెటైర్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు మహేష్. ఈ షోలో మహేష్ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కనిపించారు. 


 

ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా బాలయ్య నటించిన 'అఖండ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు కూడా ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరోపక్క మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాను పూర్తి చేయనున్నారు. సంక్రాంతికి రావాలనుకున్న ఈ సినిమా వాయిదా పడింది.