సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే మన సౌత్ హీరోలకు బాలీవుడ్ లో పాపులారిటీ దక్కింది. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ ను రాబట్టడంతో ఆయన నటించిన పాత సినిమాలను హిందీలో డబ్ చేయడానికి రెడీ అయ్యారు కొందరు నిర్మాతలు. 

 

ముందుగా 'అల వైకుంఠపురములో' సినిమా హిందీ డబ్బింగ్ వెర్ష‌న్‌ను జనవరి 26న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు గోల్డ్ మైన్స్, ఏఏ ఫిల్మ్స్ అనౌన్స్ చేశాయి. నిజానికి ఈ సినిమా రీమేక్ బాలీవుడ్ లో తెరకెక్కుతోంది. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా.. దర్శకుడు రోహిత్ ధావన్ ఈ సినిమాను మొదలుపెట్టారు. దీనికి 'షెహ్ జాదా' అనే టైటిల్ కూడా పెట్టారు. 'అల.. వైకుంఠపురములో' తెలుగు వెర్షన్ ను నిర్మించిన అల్లు అరవింద్.. భూషణ్ కుమార్, అమన్ గిల్ లతో కలిసి హిందీ రీమేక్ నిర్మిస్తున్నారు. 

 

అయితే రీమేక్ అవుతున్న సినిమా డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేస్తుండడం హాట్ టాపిక్ అయింది. కచ్చితంగా ఈ డబ్బింగ్ వెర్షన్.. రీమేక్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని అందరూ అనుకున్నారు. దీంతో అల్లు అరవింద్ గోల్డ్ మైన్స్ నిర్మాతలను కలిసి డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ ను క్యాన్సిల్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 







Also Read: 'సఖి వచ్చేస్తోంది..' కీర్తి సినిమా కొత్త రిలీజ్ డేట్..