ఎంత? ఇప్పుడు థియేటర్లలో సినిమా టికెట్ రేటు ఎంత? సాధారణంగా ఎంతకు అమ్ముతున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలు అడిగితే ఎవరూ ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కొన్ని నిబంధనల మేరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చాయి. 


'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2', 'ఆచార్య' సినిమాలకు టికెట్ రేట్లు పెంచారు. పాన్ ఇండియా సినిమాలకు క్రేజ్ ఉంది. వాటిలో కంటెంట్ ఉంది. దాంతో రేట్లు ఎక్కువ అయినప్పటికీ ప్రేక్షకులు వచ్చారు. టికెట్ రేట్లు పెంచి ఫస్ట్ వీకెండ్‌లో వీలైనంత వసూలు చేసుకోవాలనే ప్లాన్ వర్కవుట్ అయ్యింది. అయితే, 'ఆచార్య'కు టికెట్ రేట్లు ఎక్కువ ఉండటం, ప్లాప్ టాక్ రావడంతో ప్రేక్షకులు రాలేదు. 'ఆచార్య'కు ముందు కూడా కొన్ని చిన్న సినిమాలకు (ఉదాహరణకు... శ్రీవిష్ణు 'అర్జున ఫాల్గుణ', 'భళా తందనాన', కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్') మల్టీప్లెక్స్‌ల‌లో 295 రూపాయల రేటు ఉంది. అప్పట్లో చిన్న సినిమాలకు ఎంత రేట్లు ఏంటని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. స్టార్ హీరోల సినిమాలకు తెలంగాణలో 400 లెక్కన అమ్మారు. 


టికెట్ రేట్లు పెంచడం వలన కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్రమక్రమంగా దూరం అవుతున్నారని, నలుగురు కుటుంబ సభ్యులు సినిమా చూడాలంటే సుమారు 1500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందనే మాటలు వినిపించాయి. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ 'దిల్' రాజు చెవిన ఈ మాటలు పడినట్టు ఉన్నాయి. తమ సంస్థ నుంచి వస్తున్న 'ఎఫ్ 3'కి టికెట్ రేట్లు పెంచడం లేదని ప్రకటించారు. అయితే, మల్టీప్లెక్స్‌ల‌లో సుమారు 300, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 175 - రూ. 200 అమ్మారు. అది వేరే విషయం అనుకోండి. 


నిజం చెప్పాలంటే... 'మేజర్'కు టికెట్ రేట్లు పెంచలేదు. మల్టీప్లెక్స్‌ల‌లో రూ. 200లకు విక్రయించారు. సింగిల్ స్క్రీన్‌లో రేట్లు పెంచినట్టు ఆయన దృష్టికి తీసుకువెళితే... గంటల్లో సమస్య పరిష్కరించారు. 'మేజర్'కు టికెట్ రేట్స్ తగ్గించడం ప్లస్ అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. పెయిడ్ ప్రీమియర్లు హౌస్‌ఫుల్స్‌ అయ్యాయి. ఇప్పుడు 'మేజర్' బాటలో 'విక్రమ్ హిట్ లిస్ట్' కూడా వెళుతోంది.
 
Kamal Haasan's Vikram Movie Ticket Rates in Andhra Pradesh and Telangana: కమల్ హాసన్ కథానాయకుడిగా... విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, సూర్య అతిథి పాత్రలో నటించిన సినిమా 'విక్రమ్'. ఈ హీరోలకు తెలుగులో కూడా ఫాలోయింగ్ ఉంది. అలాగని, సినిమా టికెట్ రేట్లు పెంచలేదు. తెలంగాణలోని మల్టీప్లెక్స్‌ల‌లో రూ. 200, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 150... ఏపీలోని మల్టీప్లెక్స్‌ల‌లో రూ. 177, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 147 గా నిర్ణయించారు. ఇక నుంచి అందరూ ఇదే స్ట్రాటజీ ఫాలో అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.


Also Read: రెక్కీ - తాడిపత్రి మున్సిపల్ అధ్యక్షుడిని ఎవరు హత్య చేశారు? మర్డర్ మిస్టరీ సిరీస్ రిలీజ్ ఎప్పుడు?


'మేజర్', 'విక్రమ్' సినిమాలకు కుటుంబ ప్రేక్షకులు వస్తే... ఇండస్ట్రీ టికెట్ రేట్లు తగ్గించక తప్పదు. ప్రేక్షకుల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలకు, క్రౌడ్ పుల్లర్స్‌కు తప్ప... మిగతా హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ 'మేజర్', 'విక్రమ్' సినిమాలకూ హిట్ టాక్ వచ్చినా థియేటర్లకు ప్రేక్షకులు రాలేదంటే... అప్పుడు కారణాలు అన్వేషించే పనిలో ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాలు పడతాయి.


Also Read: పెళ్లి చేసుకోబోతున్న పూర్ణ - ఆమెకు కాబోయే భర్త ఎవరంటే?