దసరా పండగ రోజు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తన అభిమానులకు గిఫ్ట్‌లు ఇస్తూనే ఉన్నారు. ఈరోజు పొద్దున్నే జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరితో #RC16 అనౌన్స్ చేసిన చెర్రీ, ఇప్పుడు మరో సినిమాపై హింట్ ఇచ్చాడు. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమా చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు. చిరంజీవి, ప్రశాంత్ నీల్, రామ్ చరణ్.. ముగ్గురూ ఉన్న ఫొటోను షేర్ చేసి అందులో డీవీవీ మూవీస్‌ను ట్యాగ్ చేశారు. డీవీవీ మూవీస్ తన ట్వీటర్ ఖాతాలో చరణ్ షేర్ చేసిన ఫొటోతో పాటు మరో ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ ఫొటోలో రామ్‌చరణ్, ప్రశాంత్ నీల్, డీవీవీ దానయ్య ఉన్నారు. కాబట్టి ఈ కాంబోలో మూవీ రావడం దాదాపు ఖాయం అయిపోయింది.






యూవీ క్రియేషన్స్, ఎన్వీ ప్రసాద్ బ్యానర్లలో గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమాను ఈరోజు ఉదయాన్నే ప్రకటించిన చెర్రీ.. సాయంత్రం ఈ న్యూస్‌తో ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియరాలేదు. ఎందుకంటే రామ్‌చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్, ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఆ తర్వాత శంకర్ సినిమా షూటింగ్ పూర్తి కావాలి. గౌతం సినిమా కూడా పూర్తి కావాలి. అప్పటికి కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి లేదు. అంటే 2023 ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.


మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. కేజీయఫ్ చాప్టర్ 2 విడుదలకు సిద్ధంగా ఉండగా, ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న సలార్ షూటింగ్ ఫుల్ స్వింగ్‌తో సాగుతోంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయాల్సి ఉంది. సలార్ తర్వాత ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. కాబట్టి 2023 ద్వితీయార్థానికే ప్రశాంత్ నీల్ కూడా చరణ్ సినిమా మీదకు వెళ్లే అవకాశం ఉంది.


కేజీయఫ్ సినిమా హిట్‌తో ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయాడు. కేజీయఫ్ చాప్టర్ 2 తర్వాత తను ఏ సినిమా చేస్తాడో అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో ఒక ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడని వార్తలు వచ్చినా.. ఆర్ఆర్ఆర్ ఆలస్యం కావడంతో సలార్‌ను నీల్ స్టార్ట్ చేశాడు. ఎన్టీఆర్‌తో నీల్ చేయబోయే సినిమాను మైత్రీమూవీస్ బ్యానర్ నిర్మించనుంది. ప్రభాస్ 24వ సినిమాను కూడా నీల్ రూపొందిస్తాడని వార్తలు వస్తున్నాయి. అలాగే బన్నీతో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యాడని తెలుస్తోంది.


గతంలో మన స్టార్ హీరోలు ఒక సినిమా తర్వాత ఒక సినిమా అన్నట్లు వెళ్లేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా.. కనీసం మూడు సినిమాలు ప్లానింగ్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. టాప్ హీరోలను చూసుకుంటే ప్రభాస్ డైరీ తర్వాతి ఐదు సంవత్సరాల వరకు ఖాళీ లేదు. రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా, సలార్, తానాజీ ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్ సెట్స్ మీద ఉన్నాయి. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రాజెక్ట్ కేకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయి ఒక షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. ప్రభాస్ డేట్స్ ఇస్తే.. దీని షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్‌తో జరుగుతుంది. దీంతోపాటు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను కూడా ప్రకటించారు.


ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత రెండు సినిమాలను ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా, ఆ తర్వాత నీల్ దర్శకత్వంలో ఒక సినిమా ఉండనుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైనట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పుష్ప పార్ట్ 2 మీదకి వెళ్లేలోపు వేణు శ్రీరాంతో ఐకాన్ సినిమా పూర్తి చేసే ఆలోచనలో బన్నీ ఉన్నాడు. మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది.


ఇక పవన్ కళ్యాణ్ కూడా చాలా సినిమాలు లైన్‌లో పెట్టాడు. భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధం అవుతుండగా, తర్వాత హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు షూటింగ్ జరుపుకోనున్నాయి. సురేందర్ రెడ్డితో ఒక సినిమాను కూడా అధికారికంగా ప్రకటించారు. ఇలా టాప్ హీరోలందరూ తమ డైరీలు ఫుల్‌గా ఉంచుకుంటున్నారు. 


Also Read: నాని ఊర మాస్ గెటప్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడే..




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి