మిళనాడు నుంచి తెలుగు నేలపై అడుగుపెట్టిన సినీ రంగం కొన్నాళ్లు పెద్ద మనుషులు లేకుండానే సాగింది. టాలీవుడ్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఒక్క వేదిక కూడా ఉండేది కాదు. తమ మొరను వినే పెద్ద దిక్కు లేదా అంటూ కళాకారులు కుమిలిపోతున్న రోజుల్లో.. నేనున్నా అంటూ పుట్టిందే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) పుట్టింది. ఒకప్పుడు హూందాగా మొదలైన సేవలు.. ఆ తర్వాత లుకలుకలతో అంతర్గత కలహాలతో వర్గాలుగా విడిపోయారు. అయితే, ఇన్నాళ్లూ ఇంట్లోనే కొట్టుకున్న సభ్యులు.. ఇప్పుడు రోడ్డున పడ్డారు. పంతాలు, ఆదిపత్యం కోసం ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్నారు.


పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సాయం చేసేందుకు 1993లో తెలుగు తారలంతా విశాఖపట్నంలో క్రికెట్ ఆడి నిధులు సమకూర్చారు. అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తిరిగివస్తున్న సమయంలో చిరంజీవి, మురళీ మోహన్‌లకు మూవీ ఆర్టిస్టుల సమస్యలను తీర్చేందుకు ఒక సంఘం ఉంటే బాగుంటుందనే ఆలోచన కలిగింది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సీనియర్ నటులతో చర్చించి.. ‘మా’కు జీవం పోశారు. 1993, అక్టోబరు 4వ తేదీన ‘మా’ అసోసియేషన్ ఏర్పాటైంది. సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ.. రెబల్ స్టార్ కృష్ణం రాజులను ముఖ్య సలహాదారులుగా ఎంపిక చేశారు. ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు నిర్మించిన సొసైటీ భవనంలోని ఓ గదిలో ‘మా’ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 


సభ్యుల సంక్షేమం, నిర్మాతలతో పారితోషకాల గొడవలు పరిష్కారం, కళాకారులకు సినిమా అవకాశాలు ఇప్పించడం కోసం ఈ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. కళాకారులకు ఏమైనా కష్టాలు వస్తే పరిష్కరించడం, వివాదాలను తీర్చడం, ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు ఇవ్వడం వంటివి ‘మా’ బాధ్యత. చిరంజీవి తోడల్లుడు కేవీ రావు ఆస్పత్రి, బసవతారకం హాస్పిటల్‌లో ‘మా’ సభ్యులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.  మొత్తం 26 మందితో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కార్యవర్గం ఏర్పడింది. ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, 18 మంది ఈసీ సభ్యులు ఈ కార్యవర్గంలో ఉంటారు. మొదట్టలో ‘మా’ 150 మంది సభ్యులతో ప్రారంభమైంది. ఇప్పుడు మొత్తం 900 మంది సభ్యులు ఉన్నారు. 


తొలి అధ్యక్షుడు చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి ‘మా’కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలు అందించారు. చిరంజీవి తర్వాత మురళీ మోహన్, మోహన్ బాబు, నాగార్జున, నాగబాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా, వీకే నరేష్‌లు అధ్యక్షులుగా పనిచేశారు. అయితే, మురళీ మోహన్ ‘మా’ అధ్యక్షుడిగా ఆరుసార్లు సేవలందించారు. మొదట్లో ‘మా’ సభ్యత్వ రుసుం రూ.5 వేలు ఉండేది. ఆ తర్వాత రూ.10 వేలుకు.. చివరికి రూ.లక్షకు చేరింది. 


2015 నుంచి వార్ మొదలు: ‘మా’లో అప్పటివరకు అధ్యక్షుల ఎంపిక హూందాగానే సాగింది. అంతా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని, ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకొనేవారు. కానీ, 2015 నుంచి మాత్రం ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికారు. సభ్యులు వేర్వేరు ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సిద్ధమయ్యారు. అప్పటి నుంచి టాలీవుడ్‌లో గ్రూపు రాజకీయాలు పెరిగాయి.  


విభిన్నంగా ఎన్నికల విధానం: ‘మా’ ఎన్నికల విధానం చాలా భిన్నంగా ఉంటుంది. మా కార్యవర్గాన్ని ఎన్నుకొనేందుకు ఒక్కో ఓటరు 26 ఓట్లు వేయాలి. తమకు నచ్చి అభ్యర్థి ఏ ప్యానల్‌లో ఉన్నా ఓటు వేయొచ్చు. పేరుకు మాత్రమే రెండు ప్యానళ్ల మధ్యే పోటీ. కానీ, ఫలితాల తర్వాత రెండు ప్యానళ్లను ఒకటిగానే పరిగణిస్తారు. అంటే.. ఎక్కువ ఓట్లు సాధించే 26 మంది ఒకే ప్యానల్‌గా ఏర్పడి కలిసి పనిచేయాలి. కాబట్టి.. ఇప్పుడు ఎన్ని ఆరోపణలు చేసుకున్నా.. ఫలితాల తర్వాత ఇరు ప్యానల్ సభ్యులు కలిసి పనిచేయాల్సిందే. 


‘మా’ సభ్యత్వానికి ఎలాంటి అర్హతలు ఉండాలి?: ‘మా’లో ఎవరు పడితే వారు సభ్యత్వం పొందలేరు. ‘మా’ అసోసియేషన్ మెంబర్‌‌షిప్ కార్డు కావాలంటే సుమారు రూ.లక్ష చెల్లించాలి. కేవలం ఒకటి రెండు సినిమాల్లో కనిపించి సభ్యుడిగా చేరాలంటే కుదరదు. కనీసం మూడు సినిమాల్లో నటించాలి. సినిమాల్లో ఫుల్ లెంగ్త్ పాత్ర పోషించి ఉండాలి. అంతేకాదు.. ఆ పాత్రకు డైలాగులు కూడా ఉంటాయి. ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లో సైతం వారి పేరు ఉండాలి. ఇంకా ఇలాంటి కండిషన్లు చాలానే ఉన్నాయి. అంటే సాధారణ నటీనటులకు, చిన్నచితక పాత్రల్లో కనిపించేవారు ‘మా’లో చేరడం కష్టమే. 


Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!


Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి