బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ లను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా ఓ గుర్తుతెలియని వ్యక్తి వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో ముంబైలోని శాంటాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.


ఇన్స్టాగ్రామ్ లో కత్రినా, విక్కీలకు బెదిరింపులు వస్తున్నాయని.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి కత్రినా కైఫ్‌ను వెంటాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ.. ఐపీసీ సెక్షన్ ప్రకారం.. 506-II (నేరపూరిత బెదిరింపు), 354-డి (స్టాకింగ్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 


ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. రీసెంట్ గానే సల్మాన్ ఖాన్, అతడి తండ్రి సలీం ఖాన్ లను చంపేస్తామని లేఖ పంపించారు. బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ కు కూడా ఒక లెటర్ ద్వారా హత్యా బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు కత్రినా, విక్కీలను కూడా టార్గెట్ చేశారు దుండగులు. ఇక వీరి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కత్రినా 'టైగర్ 3' సినిమాలో నటిస్తోంది. మరోపక్క విక్కీ కౌశల్.. 'గోవిందా నామ్‌ మేరా', 'ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ', 'డుంకీ' సినిమాల్లో నటిస్తున్నారు.