భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కన్నడ సినిమా స్టార్లు, నిర్మాతలను కలిశారు. నరేంద్ర మోదీని కలిసిన వారిలో కేజీయఫ్ రాకీ భాయ్ యష్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి, ఆ రెండు సినిమాల నిర్మాత విజయ్ కిరగందూర్, స్వర్గీయ పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని పునీత్ రాజ్ కుమార్ ఉన్నారు.


గత సంవత్సరం కన్నడ చిత్ర పరిశ్రమకు గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ‘కేజీయఫ్: చాప్టర్ 2’ రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతోపాటు ‘కాంతార’ కూడా సెన్సేషనల్, సర్‌ప్రైజింగ్ హిట్ అయింది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ మీదనే రూ.400 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది.


రానున్న ఐదు సంవత్సరాల్లో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలోనే రూ.మూడు వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ గతంలోనే ప్రకటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ సినిమా 2023లోనే సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానుంది.


ఇక ‘కాంతార’ సినిమాకు కూడా ప్రీక్వెల్ తెరకెక్కనుంది. ‘కాంతార’ 100 రోజుల వేడుకలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మొదట అందరూ ‘కాంతార’కు సీక్వెల్ తెరకెక్కుతుందని అనుకున్నారు. కానీ చిత్రబృందం మాత్రం ఆశ్చర్యకరంగా ప్రీక్వెల్ ఐడియాతో వచ్చింది. దీన్ని బట్టి హీరో తండ్రి, అతని వంశ చరిత్రను ఈ సినిమాలో చర్చించే అవకాశం ఉంది.


ఇప్పుడు 'కాంతార'కు ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. అదే 'కాంతార 2'. అందులో కథానాయిక ఊర్వశి రౌతేలా నటిస్తున్నారు. ఆమెకు ఇది చాలా పెద్ద అవకాశం అని చెప్పాలి. సెన్సేషనల్ హిట్ 'కాంతార' ప్రీక్వెల్ అంటే  సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టి పడుతుంది. రిషబ్ శెట్టితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా 'కాంతార 2 లోడింగ్' అని కాప్షన్ ఇచ్చారు. దాంతో సినిమాలో ఆమె ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. 


'కాంతార'ను 'కెజియఫ్ 1', 'కెజియఫ్ 2' సినిమాలు ప్రొడ్యూస్ చేసిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. విజయ్ కిరగందూర్ నిర్మాత. ఇప్పుడీ 'కాంతార 2'ను కూడా ఆయనే నిర్మిస్తున్నారు. 'కాంతార' విజయంలో అజనీష్ లోకనాథ్ స్వరాలు, నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడీ ప్రీక్వెల్ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు.


రిషబ్ శెట్టి దక్షిణ కర్ణాటకలో తీర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన బాల్యానికి, 'కాంతార' కథకు ఓ సంబంధం ఉంది. దక్షిణ కర్ణాటకలో దైవారాధన ఎక్కువ. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు కుల దైవం వంటి ఆచారాలు ఉన్నాయి. బాల్యంలో ఆ ఆచారాలను గమనించిన రిషబ్ శెట్టి, ఈ సినిమాలో చూపించారు. ఇప్పుడీ 'కాంతార 2' వాటి గురించి మరింత ఎక్కువ చూపించే అవకాశాలు ఉన్నాయి. 


ఇక యష్ మాత్రం తన తర్వాతి సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరో రెండు నెలల్లో కేజీయఫ్: చాప్టర్ 2 వచ్చి సంవత్సరం కూడా పూర్తి కానుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే తర్వాత సినిమాలను లైన్‌లో పెట్టుకున్నారు. ప్రభాస్‌తో ‘సలార్’, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఒక సినిమా ఇప్పటికే అనౌన్స్ చేశారు.