Kisan Vikas Patra: మన దేశంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, నేటికీ మన దేశంలో అతి కొద్ది మంది మాత్రమే రిస్కీ మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నారు, సింహభాగం ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. వాళ్లంతా రిస్క్‌ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌ను (Risk Free Investment Options) ఎంచుకుంటున్నారు. 


దేశంలో ద్రవ్యోల్బణం హై రేంజ్‌లో ఉన్న ఈ సమయంలో, పెట్టుబడికి ప్రమాదం ఉండని మార్గాలే ఉత్తమంగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో, పోస్టాఫీస్‌ స్మాల్ సేవింగ్ స్కీమ్ (Post Office Small Savings Scheme) ఒక మంచి ఎంపిక. మీరు మీ డబ్బును రెట్టింపు చేయాలనుకుంటే, పోస్టాఫీస్‌ కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీ డబ్బు కేవలం 120 నెలల్లోనే రెట్టింపు (KVP Returns) అవుతుంది. ఈ పథకం వివరాలను తెలుసుకుందాం:


మంచి వడ్డీ పొందడానికి ఉత్తమ ఎంపిక


కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని పోస్టాఫీసు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. ఇటీవల, డిసెంబర్ 2023న, ప్రభుత్వం అనేక పోస్టాఫీసు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. చాలా చిన్న మొత్తాల పొదుపు పథకాల మీద ఖాతాదార్లు ఇప్పుడు 1.10 శాతం వరకు అదనంగా వడ్డీని పొందుతున్నారు. ఇదే కోవలో, కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటు కూడా 20 బేసిస్ పాయింట్లు లేదా 0.2% పెరిగింది. ఈ పెరుగుదల వల్ల, ఇప్పుడు, వినియోగదారుల డబ్బు మునుపటి కంటే 3 నెలల ముందే రెట్టింపు అవుతుంది.


కేవీపీపై ఎంత వడ్డీ వస్తోందో తెలుసా?


కిసాన్ వికాస్ పత్ర పథకం కింద, జనవరి 1, 2023 నుంచి 7.20 శాతం వడ్డీ (KVP Interest Rate) ఖాతాదార్లకు అందుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు 7.00 శాతం ఇస్తుండగా, తాజా పెంపు తర్వాత 7.20 శాతం ఇస్తున్నారు. ఈ మార్పు తర్వాత, మీరు కేవలం 10 సంవత్సరాల్లో రెట్టింపు నగదు ప్రయోజనం పొందుతారు.


కేవలం రూ. 1,000తో ప్రారంభించవచ్చు


పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర పథకం (Kisan Vikas Patra Scheme) కింద, పెట్టుబడిదార్లు తమ పెట్టుబడిని కేవలం రూ. 1,000 తో ప్రారంభించవచ్చు. ఈ పథకంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. మీరు ఎంత ఎక్కువ మొత్తాన్నయినా ఇందులో పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ ప్రయోజనం పొందడానికి సింగిల్‌, జాయింట్‌ ఖాతాలను తెరవవచ్చు. మీకు కావలసిన వారిని నామినీగా చేసుకోవచ్చు. స్కీమ్ మెచ్యూరిటీకి ముందే ఖాతాదారు మరణిస్తే, నామినీ డెత్ క్లెయిమ్ చేసి మొత్తం డబ్బును పొందవచ్చు. తద్వారా, కుటుంబానికి ఆర్థిక భరోసా దక్కుతుంది.


KVP ఖాతాను ఎలా తెరవాలి?


10 ఏళ్ల వయస్సు పైబడిన ఎవరైనా కిసాన్ వికాస్ పత్ర కింద ఖాతా తెరవవచ్చు. అయితే, ఆ ఖాతా లావాదేవీలను చూడడానికి మైనర్‌కు ఒక సంరక్షకుడు కూడా అవసరం. ఖాతా తెరిచే ప్రక్రియ చాలా సులభం. ముందుగా మీరు మీ దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లండి. కిసాన్ వికాస్ పత్ర పథకం ఖాతాను తెరవడానికి అక్కడికి వెళ్లి సంబంధింత ఫారాన్ని నింపండి. ఆ తర్వాత దరఖాస్తు డబ్బును పోస్టాఫీసులో కట్టండి. ఈ ఖాతా తెరిచిన వెంటనే, మీరు కిసాన్ వికాస్ పత్ర ధృవపత్రం పొందుతారు.