Retail investors: ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FIIs) మన స్టాక్‌ మార్కెటలో భారీగా అమ్మకాలకు (ఔట్‌ ఫ్లో) దిగడంతో, ఇండియన్‌ ఈక్విటీలు కాస్త చౌకగా మారాయి. భలే మంచి చౌక బేరం అనుకుంటూ, రిటైల్ ఇన్వెస్టర్లు కొన్ని స్టాక్స్‌ను ఎగబడి కొంటున్నారు. ఫలితంగా, మార్కెట్‌లోకి రిటైల్‌ ఇన్‌ ఫ్లోస్‌ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 


న్యూ-ఏజ్‌ టెక్‌ షేర్ల కోసం రూ. 10,261 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికంలో, దలాల్ స్ట్రీట్‌లోని 3 న్యూ-ఏజ్‌ టెక్నాలజీ కంపెనీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా బెట్టింగ్స్‌ వేశారు. కేవలం 3 కంపెనీల్లోనే ‍FSN ఈ-కామర్స్ వెంచర్స్ ‍‌(నైకా), ఈజీ ట్రిప్ ప్లానర్స్‌, వన్97 కమ్యూనికేషన్స్‌లో (పేటీఎం) రూ. 10,261 కోట్ల విలువైన షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. ఈ మొత్తంలోనూ దాదాపు సగానికి పైగా వాటాను (రూ. 5,416 కోట్లు ) నైకా షేర్ల కొనుగోలు కోసం ఖర్చు పెట్టారు. ఈ స్టాక్‌లో రిటైల్ హోల్డింగ్ సెప్టెంబర్‌ త్రైమాసికం కంటే డిసెంబర్ త్రైమాసికంలో (QoQ) 8 రెట్లు పెరిగి 10.2 కోట్ల షేర్లకు చేరుకుంది.


న్యూ-ఏజ్‌ టెక్నాలజీ కంపెనీల స్పేస్‌లో రెండో బిగ్‌ బెట్‌ ఈజీ ట్రిప్ ప్లానర్స్. ఈ కంపెనీలో చిన్న మదుపుదార్లు నికరంగా రూ. 3,749 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దీంతో, ఈ కంపెనీలో రిటైల్‌ హోల్డింగ్ దాదాపు 9 రెట్లు QoQ పెరిగి 17.4 కోట్ల షేర్లకు చేరుకుంది. ఇక మూడోదైన పేటీఎంలో, రిటైల్ ఇన్వెస్టర్ల నికర కొనుగోళ్లు రూ. 1,096 కోట్లుగా ఉన్నాయి. ఈ ఫిన్‌టెక్ మేజర్‌లో వారి మొత్తం హోల్డింగ్ QoQలో 45% పెరిగి 6 కోట్ల షేర్లకు చేరుకుంది.


రిటైల్ ఇన్వెస్టర్లే కాదు, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ 3 స్టాక్స్‌లో కొనుగోళ్లను పెంచుతున్నాయి. గత 3 త్రైమాసికాలుగా వన్97 కమ్యూనికేషన్స్, FSN ఈ-కామర్స్‌లో తమ యాజమాన్యాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ పెంచుకున్నాయి.


ఈ స్క్రిప్‌ల పనితీరును పరిశీలిస్తే... డిసెంబర్‌ త్రైమాసికంలో నైకా, పేటీఎం షేర్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. సంస్థాగత పెట్టుబడిదార్ల ఒక సంవత్సరం లాక్-ఇన్ పీరియడ్ ముగియడంతో, వాళ్లు కొంత వాటాను ఆఫ్‌లోడ్ చేసారు. అందువల్ల, ఆ త్రైమాసికంలో ఆయా షేర్ల ధరలు భారీగా పడిపోయాయి.


డిసెంబర్ త్రైమాసికంలో పేటీఎం, నైకా షేర్లు వరుసగా 17%, 27% నష్టపోయాయి. ఈజీ ట్రిప్ ప్లానర్స్ 12% లాభపడింది.


మిగిలిన బిగ్‌ బెట్స్‌
న్యూ-ఏజ్ టెక్ కంపెనీలతో పాటు.. మూడో త్రైమాసికంలో రిటైల్ ఇన్వెస్టర్లు చేసిన టాప్ 10 కొనుగోళ్లలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టాటా ఎల్‌క్సీ, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, స్టీల్ స్ట్రిప్స్ వీల్స్‌ ఉన్నాయి.


డిసెంబర్‌ త్రైమాసికంలో, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్ల కొనుగోళ్ల కోసం రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ. 6,367 కోట్లు ఖర్చు పెట్టారు. ఇదే టాప్‌-1 స్టాక్‌. ఎల్‌టీఐ మైండ్‌ట్రీలో రూ. 4,424 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.