దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాటకు ఈ అవార్డు దక్కింది. ఈ సినిమా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. అమెరికాలోని లాస్ ఎంజిల్స్ లో జరిగిన ఈ అవార్డుల ప్రదాన వేడుకల్లో దర్శకుడు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘RRR’ సినిమాకు అవార్డు రావడం పట్ల జక్కన్న సంతోషం వ్యక్తం చేశారు.


‘RRR’ సీక్వెల్ పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు


ఇదే సందర్భంగా ఈ సినిమా సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘RRR’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ లభించిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సీక్వెల్ గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. “‘RRR’ సినిమా సీక్వెల్ కు సంబంధించి మేం చాలా విధాలుగా ఆలోచిస్తున్నాం. అయితే, ఇప్పటికిప్పుడు ఈ సినిమా సీక్వెల్ చేయాలి అనుకోవడం లేదు. బలవంతంగా అలాంటి ప్రయత్నం చేయకూడదనుకుంటున్నాం. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆదరణ నేపథ్యంలో మా టీమ్ తో చర్చించాను. అప్పుడే ఓ మంచి ఆలోచన వచ్చింది. అదే కాన్సెప్టుతో ప్రస్తుతం కథ రాయడం మొదలయ్యింది. అయితే, స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యాకే సీక్వెల్ గురించి తుది నిర్ణయం తీసుకుంటాం” అని రాజమౌళి తెలిపారు.   





ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లు సాధించిన ‘RRR’


దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమ రూ. 400 కోట్లతో తెరకెక్కింది. అయితే, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లు వసూలు చేసింది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో పోటీ పడింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ తో పాటు ఉత్తమ విదేశీ చిత్రం విభాగాల్లో నామినేట్ అయ్యింది. అయితే, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది.


పలువురు ప్రముఖుల అభినందనలు


‘RRR’ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల ప్రధాని మోడీ సహా  పలువురు సినీ, రాజకీయ ప్రమఖులు  అభినందనలు తెలిపారు. ఆస్కార్ అవార్డును కూడా ఈ సినిమా గెలుచుకోవాలని ఆకాంక్షించారు.  






Read Also: ‘ధమాకా‘ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఎప్పుడు, ఎక్కడో తెలుసా?