యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా రూపొందిన ప్రేమకథా చిత్రం 'రాధే శ్యామ్'. ఇందులోని 'ఈ రాతలే...' పాట కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యింది. ఇప్పుడు తాజాగా వీడియో సాంగ్ విడుదల చేశారు. విజువల్స్ చూస్తుంటే... ఇటలీలో సాంగ్ షూటింగ్ చేసినట్టు అర్థం అవుతోంది. వర్షంలో ఆక్వేరియం తీసుకు వెళ్తున్న పూజా హెగ్డే... ప్రభాస్... ఇద్దరూ గోడల మీద బొమ్మలు గీయడం... పాట బావుందని చెప్పాలి.


'ఎవరో వీరెవరో...
కలవని ఇరు ప్రేమికులా?
ఎవరో వీరెవరో...
వీడిపోని యాత్రికులా?'
అంటూ సినిమాలో ఎదురు పడని హీరో హీరోయిన్ల గురించి చక్కటి సాహిత్యంతో వివరించారు. యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి పాడిన ఈ పాటను కృష్ణకాంత్  (కేకే) రాశారు. జస్టిన్ ప్రభాకర్ బాణీ అందించారు.


Also Read: బాలీవుడ్ మెగాస్టార్ ను 'రాధే శ్యామ్' సినిమాలోకి అలా తీసుకొచ్చిన ప్రభాస్!


'జిల్' ఫేమ్ కె.కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ పతాకాలపై వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌ నిర్మించిన చిత్రమిది. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 


Also Read: 'భీమ్లా నాయక్' రివ్యూ: కమర్షియల్ కిక్ ఇచ్చే నాయక్! సినిమా ఎలా ఉందంటే?