ఆదిత్య మల్లికార్జున్ కోసం వెతుకుతూ ఉంటే మాధవ్ వస్తాడు. ఎవరి కోసమో వెతుకుతున్నట్టు ఉన్నావ్, నేను ముందే ఊహించాను నువ్వు ఇక్కడికి వచ్చి వాడిని నాలుగు తనని వాడి నోట నిజం చెప్పిస్తావని అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని మాధవ్ అంటాడు. ఆదిత్య కోపంగా మాధవ్ కలర్ పట్టుకుంటాడు. నా మీద చెయ్యి ఎత్తడం, నా కలర్ పట్టుకోవడం చాలా చిన్న విషయం అయిపోయింది నీకు రాధకి, మీరు నాతో ప్రవర్తించిన ప్రతిసారి నా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసి కూడా మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని అని మాధవ్ అంటాడు.


ఆదిత్య: రేయ్ మాధవ్ నా సహనాన్ని పరీక్షించొద్దు. మీద చెయ్యి వేస్తే నువ్వు ఎత్తులు మాత్రమే వేస్తావేమో నేను నీ గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే నువ్వు అనేవాడివి కనిపించవు మర్యాదగా వాడు ఎవడో చెప్పు లేదంటే నిన్ను..  


మాధవ్: నువ్వు ఏం చేసినా వాడేవాడో నేను చెప్పను చెప్తే ఏం చేస్తావో నాకు తెలుసుగా


ఆదిత్య: వాడేవాడితోనే పనేంట్రా నీతోనే నిజం చెప్పిస్తాను


మాధవ్: నా ప్రాణం పోయినా నేను నిజం చెప్పడం జరగదు


ఆదిత్య: అసలు నీ ప్రాణం పోతే సమస్యే ఉండదు కదా, నువ్వు నిజం చెప్పకపోతే జరిగేది అదే. నేను నిన్ను ఏం చెయ్యకుండా వదిలేస్తున్నా అని భ్రమ పడకు ఇప్పటిదాకా నీ ఇంటి నుంచి తీసుకెళ్లలేదు అంటే తీసుకెళ్లలేక కాదు నా భార్య చెప్పిందనే. ఇప్పుడు డిసైడ్ అయ్యాను నీ అంతు చూశాకే నా భార్య,బిడ్డని నీ ఇంటి నుంచి తీసుకుని వెళ్తాను. నీ నోటితోనే నిజం చెప్పిస్తాను. ఇంతకాలం నా బిడ్డని నాకు దూరం చేసినందుకు నా బిడ్డే నిన్ను చంపుతుంది. ఆ పరిస్థితి నీ చేతులారా నువ్వే తెచ్చుకుంటున్నావ్ అనేసి కోపంగా వెళ్ళిపోతాడు.


Also Read: కార్తీక్ కి దీప గతం గుర్తొచ్చేలా చేయగలదా, మోనితపై సౌందర్యలో మొదలైన అనుమానం!


దేవి బాధగా కూర్చుని ఉండేసరికి జానకి వచ్చి ఏమైంది ఎవరైనా ఏమైనా అన్నారా అని ప్రేమగా అడుగుతుంది. ఏమి లేదని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది. ఏంటమ్మా దేవి అలా ఉందని జానకి రాధని అడుగుతుంది. ఏమైందో నీకైనా చెప్పిందా అని అడుగుతుంది.  లేదని అనేసరికి జానకి అనుమానపడుతుంది. దేవి, రాధ అలా ఉన్నారు ఏదో జరుగుతుందని జానకి మనసులో అనుకుంటుంది. రాధ ఆలోచిస్తూ ఉంటే మాధవ్ వస్తాడు. ఏంటి రాధ ఏం చెయ్యాలి ఏ దారిలో వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావా.. ఏ దారి దొరకదు అన్ని దారులు మూసేశాను అని మాధవ్ అంటాడు. నువ్వు మూసేసిన దారులు బద్దలు కొట్టడానికి నా పెనిమిటి ఉన్నాడని రాధ ధీమాగా చెప్తుంది.


ఈసారి ఆదిత్య కూడా ఏం చెయ్యలేడు ఏమైనా చెయ్యాలని అనిపిస్తే నీ బాధ చూడలేక నేనే చెయ్యాలి. దీనికి కారణం నువ్వే. నువ్వు ఇలా ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నా. అందుకే ఒక పని చెయ్యి నువ్వు ఆశపడినట్టు దేవిని ఆదిత్యకి ఇచ్చేద్దాం, నువ్వు చిన్మయికి తల్లిగా ఉండు అలాగే నాకు.. అని మాధవ్ అనేసరికి రాధ కోపంగా సారు అని చెయ్యి ఎత్తి కొట్టబోతుంది. బిత్తరపోయిన మాధవ్ ఎవరైనా చూసారేమో అని చుట్టూ చూసుకుంటాడు. నా మీద ఆశపడితే ఇట్లనే ఉంటది ఈసారి ఈ చెయ్యి ఇక్కడదాక వచ్చి ఆగదు, ఎవరు లేనప్పుడు చెయ్యి ఎత్తితేనే అటు ఇటు చూస్తూ గుటకలు మింగుతున్నావ్ నేను చీర లాగితే కొప్పు పెట్టుకుని ద్రౌపది లెక్క ఎదురు చూసేదాన్ని కాదు.. ముట్టినోడి చెయ్యి నరికి చేతిలో పెట్టె రకం గుర్తు పెట్టుకో అనేసి కోపంగా వెళ్ళిపోతుంది.


Also Read: ఆవేశంలో సామ్రాట్ ముందు నిజం కక్కేసిన నందు- బెడిసికొట్టిన లాస్య స్కెచ్


దేవి దగ్గరకి దొంగ తండ్రి మల్లికార్జున్ వచ్చి చాక్లెట్స్ ఇచ్చి తండ్రి ప్రేమ చూపించినట్టు నటిస్తాడు. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను కానీ మీ అమ్మ మన ఇద్దరినీ కలవనివ్వదు అందుకే ఇన్ని రోజుల తర్వాత కనిపించినా నేను ఎవరో తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తుంది అందులో మీ అమ్మ తప్పు లేదు నాదే తప్పు తాగి తాగి ఒళ్ళు తెలియకుండా రాధకి నరకం చూపించాను ఇప్పుడు అనుభవిస్తున్నా. నేను మారిపోయాను మీ అమ్మతో కలిసి బతకాలని ఆశపడుతున్నా అని కల్లబొల్లి మాటలు చెప్తాడు. దేవితో మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళే సమాయనికి ఆదిత్య స్కూల్ కి వస్తాడు కానీ మల్లికార్జున్ ని చూడడు.


మాధవ్ మల్లికార్జున్ కి ఫోనే చేసి దేవిని తనతో పాటు తీసుకెళ్లమని చెప్తాడు. నేను అనుకునేది జరిగేంత వరకు దేవిని నీ దగ్గర నుంచి కదలకుండా చెయ్యి అని చెప్తాడు. రాధ నువ్వు నా చెంప మీద కొట్టబోయావు అందుకు ప్రతిఫలంగా నీకు నీ పెనిమిటికి ఊపిరి ఆడకుండా చేస్తాను, నా బిడ్డ ఎక్కడా అని నువ్వు ఏడ్వాలి. చివరకి నా బిడ్డ ఎక్కడ మాధవ్ సారు అని నా కాళ్ళ మీద పడాలి, అడుక్కోవాలి అని మాధవ్ తన కుట్రని బయటపెడతాడు.