Vijay Devarakonda Family Star : టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల పండగ జరగబోతోంది. సుమారు అరడజనుకు పైగా సినిమాలు పొంగల్ రేసులో నిలవనున్నాయి. మహేష్ బాబు, రవితేజ, నాగార్జున, వెంకటేష్ లాంటి బడా హీరోల సినిమాతో పాటు విజయ్ దేవరకొండ, తేజ సజ్జా లాంటి యంగ్ హీరోలు సైతం సంక్రాంతికి పోటీ పడబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే సంక్రాంతి రేసు నుండి రౌడీ హీరో విజయ్ దేవరకొండ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ఏంటి? డీటెయిల్స్ లోకి వెళితే.. రీసెంట్ గా 'ఖుషి' మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.


ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'(Family Star).'గీత గోవిందం'(Geetha Govindam) మూవీ ఫేమ్ పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. 'గీతా గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురాం - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడం, అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండడంతో 'ఫ్యామిలీ స్టార్' మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్ టీజర్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.


ముఖ్యంగా టీజర్ లో 'ఐరనే వంచాలా ఏంటి?' అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం 'ఫ్యామిలీ స్టార్' సంక్రాంతికి రావడం కష్టమే అని చెబుతున్నారు. అందుకు కారణం షూటింగ్ ఆలస్యం అవ్వడమే అని తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే, ఫ్యామిలీ స్టార్ మూవీకి సంబంధించి ఓ లాంగ్ షెడ్యూల్ ని అమెరికాలో ప్లాన్ చేసింది మూవీ టీం.


ఈ క్రమంలోనే వీసాల కోసం అప్లై చేయగా సరైన సమయానికి వీసాలు అందకపోవడంతో షూటింగ్ ఆలస్యమైంది. దాంతోపాటు సినిమాకు సంబంధించి మిగతా పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరోపక్క ఈ మూవీ డిజిటల్ పార్ట్నర్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. వచ్చే సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద హెవీ కాంపిటీషన్ ఉండడం, చాలా సినిమాలు రిలీజ్ అవుతుండడంతో దిల్ రాజు అండ్ టీం 'ఫ్యామిలీ స్టార్' మూవీని సంక్రాంతికి కాకుండా సమ్మర్(Summer) కి ఓ మంచి డేట్ చూసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


త్వరలోనే ఇందుకు సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : ప్రభాస్ 'సలార్'లో గెస్ట్ రోల్ చేస్తున్న ఆ స్టార్ హీరో? థియేటర్స్ షేక్ అవ్వడం గ్యారెంటీ!