రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా ఈ రోజు కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. హీరోగా ఆయనకు 13వ సినిమా (VD13 Movie).  ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. 'దిల్' రాజు, శిరీష్ నిర్మాతలు. పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేశారు. 


విజయ్ జోడీగా 'సీతా రామం' బ్యూటీ!
విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను కథానాయిక ఎంపిక చేశారు. 'సీతా రామం'లో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను  ఫిదా చేసింది. ఆ తర్వాత నాని సినిమాలో అవకాశం అందుకున్నారు. తెలుగులో ఆమెకు ఇది మూడో సినిమా. పూజా కార్యక్రమాల్లో ఆమె కూడా పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత, మల్లెమాల అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవంలో విజయ్ దేవరకొండ తండ్రి దేవరకొండ గోవర్ధన్ రావు కూడా పాల్గొన్నారు. 


త్వరలో సెట్స్ మీదకు!
Vijay Devarakonda Next Movie : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళుతుందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది.






Also Read : ఆయన ఇంకా 'ఆదిపురుష్' చూడలేదు, విడుదలకు ముందు చూసే అలవాటు లేదు



విజయ్ దేవరకొండ, 'దిల్' రాజు సినిమాకు తొలుత దర్శకుడిగా చాలా మంది పేర్లు వినిపించాయి. మోహన కృష్ణ ఇంద్రగంటి నుంచి గౌతమ్ తిన్ననూరి వరకు కొందరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరకు, పరశురామ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశారు. 14 రీల్స్, గీతా ఆర్ట్స్ సంస్థలో చేయాల్సిన సినిమాలను పక్కన పెట్టి మరీ పరశురామ్ ఈ సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.


Also Read 'గుంటూరు కారం'లో అందాల ఘాటు - మహేష్ సినిమాలో శ్రీలీల లుక్కు


ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమా చేస్తున్నారు. అందులో ఆయనకు జోడీగా సమంత రూత్ ప్రభు నటిస్తున్నారు. గతంలో ఆమెతో 'మజిలీ' వంటి సూపర్ హిట్ సినిమా తీసిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. బహుశా... ఆ సినిమా పూర్తి అయ్యాక పరశురామ్ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది ఏమో!?


టర్కీ వెళ్లి వచ్చిన విజయ్ దేవరకొండ
ఇటీవల 'ఖుషి' సినిమా కోసం విజయ్ దేవరకొండ టర్కీ వెళ్లి వచ్చారు. ఓ పాటను అక్కడ చిత్రీకరణ చేశారు. 'ఖుషి' చిత్రానికి హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ 'నా రోజా నువ్వే' పాటను విడుదల చేశారు. ఆ పాటకు దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యం అందించారు. మణిరత్నం మీద తనకు ఉన్న అభిమానాన్ని కూడా చాటుకున్నారు. 


'నా రోజా నువ్వే...' పాటలో మణిరత్నం సినిమా తెలుగు టైటిల్స్ అన్నీ వచ్చేలా కొన్ని లైన్స్ రాశారు శివ నిర్వాణ. సినిమాలో మిగతా పాటలను కూడా ఆయనే రాస్తున్నారని సమాచారం. దర్శకుడే అన్ని పాటలు రాయాలని సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ మరీ మరీ కోరారట.