Kollywood Director Vignesh Shivan : ఈమధ్య కోలీవుడ్ సినీ సెలబ్రిటీలు సినిమా వార్తల కంటే వివాదాలతోనే ఎక్కువ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్, డైరెక్టర్.. ఇలా పలువురు ఏదో ఒక రకంగా వివాదాల్లో చిక్కుకుని కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం ఎక్కువైపోయింది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. విగ్నేష్ శివ కి ప్రముఖ కంపెనీ నుంచి నోటీసులు అందాయి. అది కూడా ఆయన కొత్త సినిమా టైటిల్ విషయంలో రావడం గమనార్హం. ఈమధ్య సినిమా కథలు, పాటలు మాత్రమే కాదు టైటిల్స్ కూడా వివాదాలకు దారితీస్తున్నాయి.


ఈ నేపథ్యంలోనే విగ్నేష్ శివన్ కొత్త సినిమా టైటిల్ పెద్ద వివాదానికి దారి చేసింది. లవ్ టుడే మూవీ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఉప్పెన బ్యూటీ కృతి సనన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి 'LIC' అనే టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. LIC అంటే 'లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' అని అర్థం వచ్చేలా మూవీ టీం క్రేజీ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక టైటిల్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడంతో ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ టైటిల్ తో హర్ట్ అయిన LIC కంపెనీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మూవీ టీంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు డైరెక్టర్ విగ్నేష్ శివన్ కి నోటీసులు జారీ చేసింది.


ప్రజల్లో మంచి పేరు ఉన్న LIC సంస్థను ఇలా సినిమాల కోసం ఉపయోగిస్తే తమ సంస్థకు భంగం వాటిల్లుతుందని ఆరోపిస్తూ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా టైటిల్ మార్చకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఇప్పటివరకు ఈ వివాదంపై మూవీ టీం స్పందించింది లేదు. ఈ సినిమా డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అయిన విగ్నేష్ శివన్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఇక విగ్నేష్ శివన్ విషయానికొస్తే.. ఇటీవల 'కాతు వాక్కుల రెండు కాదల్' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత డైరెక్షన్ కి కొంత గ్యాప్ తీసుకున్న ఈయన రీసెంట్ గానే ప్రదీప్ రంగనాథన్ తో కొత్త సినిమాని అనౌన్స్ చేశారు.


దీనికంటే ముందు అజిత్‌తో ఓ సినిమాను విఘ్నేష్ శివ‌న్ అనౌన్స్‌చేశాడు. కానీ అజిత్ ఇమేజ్‌కు త‌గ్గ క‌థ కుద‌ర‌క‌పోవ‌డంతో ఈ సినిమా ఆగిపోయింది. ఇక LIC సినిమాని తొలుత కోలీవుడ్ స్టార్ శివ‌కార్తికేయ‌న్‌తో చేయాల‌ని విఘ్నేష్ శివ‌న్ అనుకున్నాడట. కానీ అనివార్య కార‌ణాల శివ‌కార్తికేయ‌న్ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డంతో ప్ర‌దీప్ రంగ‌నాథ్‌ను హీరోగా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. ఎస్‌జే.సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. 2024 సమ్మర్ కి ఈ సినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


Also Read : 'కేజీఎఫ్' హీరో యశ్ బర్త్ డే వేడుకల్లో అపశృతి - ముగ్గురు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం