FIR Filed on Annapoorani: సినిమాల్లోని ప్రతీ చిన్న విషయాన్ని కొంతమంది ప్రేక్షకులు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అందుకే కొన్ని సినిమాల వల్ల, అందులోని సీన్స్ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆ సినిమాలపై కేసులు పెట్టేవరకు వెళ్తారు. తాజాగా నయనతార నటించిన ‘అన్నపూర్ణి’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఈ మూవీలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సీన్స్ ఉన్నాయని ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అయితే ‘అన్నపూర్ణి’ మూవీ విడుదల అవ్వకముందే రాష్ట్రీయ హిందూ మహాసభ రాష్ట్రీయ ప్రతినిధి ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కేసు పెట్టారు. ఇక ఈ మూవీ ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా మళ్లీ అదే సమస్య ఎదురవుతోంది.


అప్పుడలా.. ఇప్పుడిలా..
నీలేష్ కృష్ణ తెరకెక్కించిన ‘అన్నపూర్ణి’లో నయనతార ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించింది. ఆ మూవీ ట్రైలర్ విడుదలయినప్పుడే ఈ మూవీలో బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచే విధంగా సీన్స్ ఉన్నాయని రాష్ట్రీయ హిందూ మహాసభ రాష్ట్రీయ ప్రతినిధి అన్నారు. అంతే కాకుండా ‘అన్నపూర్ణి’ని బ్యాన్ చేయాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత గొడవ క్లియర్ అయిపోయింది. ఈ మూవీ థియేటర్లలో కూడా విడుదలయ్యింది. యావరేజ్ టాక్‌తో పరవాలేదు అనిపించుకున్న ఈ సినిమా.. ఇటీవల ఓటీటీలో కూడా విడుదలయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా ‘అన్నపూర్ణి’ స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. దీంతో మళ్లీ కొత్తగా సమస్యలు మొదలయ్యాయి.


బ్రాహ్మణ అమ్మాయి నమాజ్ చేసింది..
‘అన్నపూర్ణి’లో హీరోయిన్‌గా నటించిన నయనతారతో పాటు ఇతర మూవీ టీమ్‌పై కూడా ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. హిందువులను మనోభావాలను దెబ్బతీస్తూ.. లవ్ జీహాద్‌ను ప్రమోట్ చేసేవిధంగా సినిమా ఉందని శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి ఎఫ్‌ఐఆర్‌ను ఫైల్ చేసినట్టు సమాచారం. ‘అన్నపూర్ణి’ని యాంటీ హిందు సినిమా అని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒక బ్రాహ్మణ అమ్మాయి పాత్ర పోషిస్తూ.. మాంసం వండుతుంది. అలా వంట చేసేముందు తను నమాజ్ కూడా చేస్తుంది. సినిమాలోని ఈ సీన్స్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని రమేశ్ సోలంకి పేర్కొన్నారు. అంతే కాకుండా ఇందులో హీరోగా నటించిన జై.. రాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడన్నారు.


ఉత్తర ప్రదేశ్ డీజీపీకి విన్నపం..
ఉత్తర ప్రదేశ్, ముంబాయ్ పోలీసులు ‘అన్నపూర్ణి’ టీమ్‌పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని రమేశ్ సోలంకి కోరారు. వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోమని ఉత్తర ప్రదేశ్ డీజీపీని కోరారు. అయితే సినిమా విడుదల అవ్వకముందు ఇలాంటి ఒక కాంట్రవర్సీ ఎదురైనప్పుడు కూడా నయనతార గానీ, మూవీ టీమ్ గానీ దీనిపై స్పందించడానికి ముందుకు రాలేదు. అంతే కాకుండా ఎవరి బెదిరింపులను పట్టించుకోకుండా ‘అన్నపూర్ణి’ని థియేటర్లలో విడుదల చేసి చూపించారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా సినిమాకు అదే సమస్య ఎదురవుతోంది. ఇప్పుడు కూడా మూవీ టీమ్ స్పందించడానికి ఇష్టపడడం లేదు. చివరికి నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ ఘటనపై స్పందించడం లేదు.


Also Read: ‘సైంధవ్’ క్లైమాక్స్ చూస్తే గూజ్‌బంప్స్ పక్కా - ట్రైలర్ జస్ట్ శాంపిల్ మాత్రమేనట!