రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'టైగర్ నాగేశ్వరరావు'. ఇది మాస్ మహారాజా కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'వీడు' అనే సెకండ్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేసారు. ప్రోమోతోనే ఆసక్తిని కలిగించిన ఈ పాట, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా సాగింది. 


''పంతం కోసం ఆకలే వీడు.. అధికారం కోసం మోహమే వీడు.. ఐశ్వర్యం కోసం అత్యాశే వీడు..'' అంటూ సాగిన ఈ పాట టైగర్ నాగేశ్వరరావు ఆవేశాన్ని, ఆయన పాత్ర స్వభావాన్ని వివరిస్తుంది. రవితేజ ఇందులో ఏమాత్రం కనికరం లేని ఒక గజదొంగగా కనిపిస్తున్నారు. ఐశ్వర్యం కోసం అధికారం కోసం ఎంత వరకైనా వెళ్తాడని ఈ సాంగ్ ద్వారా అర్థమవుతోంది. ''కామం అంటే కోరుకోవడం.. కోరిక లేని బ్రతుకే శూన్యం.. కరుణే లేని ఈ కాలంలో.. క్రోదం అన్నది కాచే కవచం..'' అంటూ అతనిలోని రెండు కోణాలను చూపించారు. 


మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ పవర్ ఫుల్ బీట్‌తో రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగా మాంచి మాస్ ట్యూన్ కంపోజ్ చేసారు. ''అందరు ఆగిపోయిన చోట మొదలవుతాడు వీడు.. అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు వీడు.. అవసరం అనుకుంటే తన నీడను వదిలేస్తాడు వీడు.. సచ్చిపోయేటప్పుడు ఏదో తీసుకుపోయేవాడు వీడు.. ఎదగడమే జన్మ హక్కంటాడు వీడు'' అంటూ హీరో పాత్రను ఎలివేట్ చేసేలా లిరిక్స్ అందించారు గీత రచయిత చంద్రబోస్. సింగర్ అనురాగ్ కులకర్ణి తన వాయిస్ తో ఈ పాటకు మరింత ఎనర్జీని జోడించారు.



Also Read: రూ.400 కోట్లకు అమ్ముడైన ఆ సీనియర్ నటుడి ఇల్లు!


'ఏక్ దమ్' సాంగ్ లో టైగర్ నాగేశ్వరరావు లవ్ అండ్ రొమాంటిక్ సైడ్‌ ను చూపించగా.. ఇప్పుడు 'వీడు' పాటలో అతని ఫెరోషియస్ అవతారాన్ని ప్రెజెంట్ చేశారని చెప్పాలి. కంప్లీట్ మాస్ రోల్ లో ఇంటెన్స్ లుక్ తో రవితేజ ఆకట్టుకున్నాడు. ఈ లిరికల్ వీడియోలో సినిమాటోగ్రాఫర్ మధే విజువల్స్ టాప్ క్లాస్ గా ఉన్నాయి. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేసారు. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఈ సాంగ్ సెటప్ అంతా గ్రే టోన్ లో డిజైన్ చేయబడింది. అవినాష్ కొల్లా ఆర్ట్ డిజైనర్ గా వర్క్ చేయగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేసారు. 


మొత్తం మీద 'వీడు' పాట మాస్ రాజా అభిమానులను విశేషంగా అలరించడమే కాదు, సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తామా అనే ఉత్సుకతను పెంచుతోంది. ఇది ఖచ్చితంగా 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో హై ఇచ్చే ఎలిమెంట్ అవుతుందనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. 


'టైగర్ నాగేశ్వరరావు' చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. 70స్ లో స్టూవర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్, జిషు సేన్‌ గుప్తా, మురళీ శర్మ, నాజర్, హరీష్ పేరడీ, సుదేవ్ నాయర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందించారు. దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా విడుదల కాబోతోంది. 


Also Read: 'జోరుగా హుషారుగా షికారు పోదమ' - కొత్త సినిమాతో వచ్చిన సంతోష్ శోభన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial