UI First Look Teaser: కన్నడలో సీనియర్ హీరో అయిన ఉపేంద్ర.. గతకొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. అందరు ఒక ఫార్మాట్‌లో సినిమాలు చేస్తూ వెళ్లినా.. తను మాత్రం ఆ ఫార్మాట్ ఫాలో అవ్వకుండా డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నించేవారు ఉపేంద్ర. ఇక చాలాకాలం ‘యూఐ’ అనే పేరుతో ఒక కొత్త సినిమాలో నటించడంతో పాటు దానిని తానే డైరెక్ట్ చేశారు కూడా. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసింది. ఇక తాజాగా దీనికి సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ చివర్లో ఉపేంద్ర లుక్ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది.


అప్పుడు గ్లింప్స్.. ఇప్పుడు టీజర్..
చాలాకాలం తర్వాత దర్శకుడిగా ఉపేంద్ర మైక్రోఫోన్ పట్టబోతున్నారన్న వార్త.. తన ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచేసింది. ఇక ఆ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను గతేడాది సెప్టెంబర్‌లో తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు ఉపేంద్ర. ‘యూఐ’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ గ్లింప్స్.. ప్రేక్షకులను అయోమయంలో పడేసింది. ఎందుకంటే ఈ గ్లింప్స్ అంతా చీకటిగా ఉంది. కేవలం డైలాగులు మాత్రమే వినిపించాయి. దీంతో ఇలాంటి గ్లింప్స్ ఎక్కడా చూడలేదంటూ సోషల్ మీడియాలో దీనిని తెగ షేర్ చేశారు ప్రేక్షకులు. ఇప్పుడు ‘యూఐ ఫస్ట్ లుక్ టీజర్’ పేరుతో ఒక టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌తో ప్రేక్షకులను మరింత కన్‌ఫ్యూజన్‌లో పడేశారు ఉపేంద్ర.


ఎలా తప్పించుకుంటావు?
‘అంతా చీకటిగా ఉంది. దీని నుండి ఎలా తప్పించుకుంటావు?’ అనే డైలాగ్‌తో ‘యూఐ’టీజర్ ప్రారంభమయ్యింది. ఆ తర్వాత టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం పలువురు యాక్టర్ల షాట్స్ మాత్రమే ఉన్నాయి. చివర్లో గుర్రంపై ఉపేంద్ర ఎంట్రీ ఇచ్చారు. ఫైనల్‌గా ఈ మూవీలో తన లుక్‌ను రివీల్ చేశారు. ఇందులో ఉపేంద్ర డీ గ్లామర్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను భయపేట్టేలా ఉన్నారు. టీజర్‌ను బట్టి చూస్తే.. ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని అర్థమవుతోంది. పైగా విజువల్స్ కూడా రిచ్‌గా కనిపిస్తున్నాయి. అజనీష్ బీ లోక్‌నాథ్ ఇచ్చిన మ్యూజిక్.. ‘యూఐ’ టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. 



రూ.100 కోట్ల బడ్జెట్‌తో..
2015లో ‘ఉప్పి 2’ అనే మూవీని డైరెక్ట్ చేసి నటించారు ఉపేంద్ర. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన మళ్లీ మైక్రోఫోన్ పట్టలేదు. దీంతో చాలాకాలం తర్వాత తమ అభిమాన నటుడు డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో ఉప్పీ ఫ్యాన్స్ అంతా ‘యూఐ’ కోసం ఎదురుచూస్తున్నారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని లహరీ ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పీతో పాటు వీనస్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు నిర్మించాయి. వర్చువల్ రియాలిటీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుందని గ్లింప్స్‌లోనే రివీల్ చేశారు. ఇందులో ఉపేంద్రతో పాటు సన్నీ లియోన్, మురళీ శర్మ, నిధి సుబ్బయ్య, ఇంద్రజీత్ లంకేశ్, మురళీ కృష్ణలాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ‘యూఐ’ చిత్రంలో 90 శాతం గ్రాఫిక్సే ఉంటాయని, దానికోసం చాలా ఖర్చుపెట్టామని ఇప్పటికే ఉపేంద్ర ఒక సందర్భంలో బయటపెట్టారు.


Also Read: సంక్రాంతికి ఓటీటీలో సందడే సందడి - ఈ వారం విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే