సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే అయినా.. రాజకీయాలపై కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు తమ్మారెడ్డి భరద్వాజ. రాజకీయాల్లో ఏ పెద్ద పరిణామం జరిగినా.. రియాక్ట్ అవ్వడానికి తమ్మారెడ్డి ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ నాయకురాలు అనే విషయం పక్కన పెడితే.. ఏ మహిళపై కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటూ చాలామంది రాజకీయా ప్రముఖులతో పాటు ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ కూడా అదే విషయంపై రియాక్ట్ అవుతూ బండారును విమర్శించారు.


బండారు సత్యానారాయణ, రోజా మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి మాట్లాడుతూ భరద్వాజ ముందుగా.. ‘‘ఆవిడ అనలేదా, మేము అనలేదా అంటున్నారు. ఫస్ట్ పాయింట్ ఒకరు గడ్డి తింటే.. మరొకరు గడ్డి తినక్కర్లేదు. ఇంకొకటి ఈ గడ్డి తిన్నవారు ఈయన తిట్టగానే మేము స్త్రీలం అని చెప్పడం కూడా తప్పు. స్త్రీ, పురుషులు అని సమానత్వం కోసం మనం పోరాడుతున్నాం. మంత్రులు అయ్యాక.. నేను స్త్రీ అనడం కరెక్ట్ కాదు. ఆడవారు అయినా, మగవారు అయినా ముందుగా గౌరవించడం నేర్చుకోవాలి. మాట జారడం అనేది అసహ్యంగా ఉంటుంది. ఆవిడ చాలాసార్లు చాలామందిపై మాటజారారు. ఇప్పుడు ఈయన జారారు. ఆయన ఒక మాజీ మంత్రి, బాధ్యత ఉన్న వ్యక్తి.. మాట తూలడం అనేది అసభ్యకరం. ఏం చేసినా పాపం లేదు. ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడకూడదు.’’ అంటూ ముందుగా వారిద్దరి మధ్య జరిగిన గొడవపై తన అభిప్రాయాన్ని చెప్పారు తమ్మారెడ్డి.


ఒకప్పుడు రోజాకు, టీడీపీకి ఉన్న సంబంధాన్ని కూడా తమ్మారెడ్డి గుర్తుచేశారు. ‘‘2004లో రోజా కాన్వాసింగ్ చేశారు. మీరు అన్నవే నిజాలు అయితే అలాంటి వారితో కాన్వాసింగ్ ఎందుకు చేయించుకున్నారు. ఆవిడను రాష్ట్రమంతా తిప్పి, గౌరవ మర్యాదలతో చూసి, మహిళ అధ్యక్షురాలిని చేసి, ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. ఇన్ని చేసి ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు అనడానికి సిగ్గు అనిపించట్లేదా? ఆవిడ వెళ్లిపోయిన తర్వాత తిడుతున్నారు కానీ ఇక్కడ ఉన్నప్పుడు మీకోసం ఆవిడ చాలామందిని తిట్టిందిగా. బండ భూతులు తిట్టింది. అప్పుడు మీకేం గుర్తురాలేదు. ఆవిడ వెళ్లిపోయిన తర్వాత క్యారెక్టర్ మంచిది కాదు అని తెలుసుకొని, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి, మీ దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయా? అసలు మీరెందుకు చూశారు. బ్లూ ఫిల్మ్స్ చూడడమే తప్పు కదా. ఇవన్నీ మాట్లాడకుంటూ పోతే అసహ్యంగా ఉంటుంది’’ అంటూ అప్పటికీ, ఇప్పటికీ రోజాకు దక్కుతున్న మర్యాద గురించి తమ్మారెడ్డి ఎత్తిచూపారు.


పార్టీల మధ్య గొడవల గురించి, వారు వాగ్వాదాల సమయంలో మాట్లాడుతున్న అసభ్యకర మాటల గురించి కూడా తమ్మారెడ్డి స్పందించారు. ‘‘అసెంబ్లీలో కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు ఖండించాను. అసెంబ్లీలో ఒక్కొక్కరు మాట్లాడుకునేది అసలు మనుషులు వినేటట్టు లేదు. ఒక్క పార్టీని అనడం లేదు. అన్ని పార్టీలు. చాలా అసభ్యంగా ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం వారు ఏమైనా మాట్లాడితే.. తీసి బయటపడేస్తున్నారు కదా.. అలాగే వైఎస్సార్సీపీ వారు ఏమైనా తప్పులు మాట్లాడినప్పుడు, బూతులు మాట్లాడినప్పుడు వారిది ఎందుకు తీసేయడం లేదని నేను అడుగుతున్నాను. రికార్డ్స్‌లో నుండి తీసేయడం వరకు ఎందుకు. పగ సాధింపు చర్యలేనా?’’ అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా తమ్మారెడ్డి కామెంట్స్ చేశారు. 



Also Read: రాజకీయాల్లోకి రంగమ్మత్త? బీజేపీ ఆహ్వానిస్తే వెళ్తారా అన్న ప్రశ్నకు అనసూయ సమాధానం ఇదే


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial