Rajamouli on SSMB 29 Movie Story: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి కలిసి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆఖరున సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే... మరి, కథ రెడీ అయ్యిందా? ఎలా ఉండబోతోంది? అనే విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షక లోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సుమారు 800 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని వార్తలు రావడంతో సినిమాపై మరింత ఆసక్తి మొదలైంది. అయితే... కథ ఇంకా ఫైనల్ కాలేదని ఇటీవల రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ అప్‌డేట్‌ రాజమౌళి ఇచ్చారు.


రీసెంట్‌గా ఓ హాలీవుడ్ మీడియాకు రాజమౌళి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మహేష్ బాబుతో చేయబోయే సినిమా గురించి మాట్లాడారు. "సాధారణంగా ఓ సినిమా విడుదలైన తర్వాత రెండు నెలలు విశ్రాంతి తీసుకుని, హాలిడేకి వెళ్లి వచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీ కథ గురించి ఆలోచిస్తాం. కరోనా వల్ల 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు కొంత గ్యాప్ వచ్చింది. జనవరి 7న సినిమాను విడుదల చేయాలనుకుంటే... కరోనా కారణంగా మార్చి 25కి వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ గ్యాప్‌లో మా నాన్న ఫోన్ చేసి 'టైమ్ వేస్ట్ చేయకు. కథ మీద కూర్చుందాం' అన్నారు. మేం కొన్ని లైన్స్ డిస్కస్ చేసుకున్నాం. మహేష్ బాబుతో చేయబోయేది యాక్షన్ అడ్వెంచర్. రెండు కథలు ఉన్నాయ్! కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆ సినిమా స్టోరీ మీద మళ్ళీ కూర్చుంటాం" అని రాజమౌళి పేర్కొన్నారు.


Also Read: మా అక్కా? నేనా? బాయ్‌ ఫ్రెండ్‌ తో లేచిపోయింది ఎవర్రా? - శివాత్మిక ఫైర్


ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రీకరణ చేస్తున్న మహేష్, త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా స్టార్ట్ చేయాలనేది ప్లాన్. మహేష్ బాబుకు 29వ చిత్రమిది. ఈ సినిమాను కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు. హిందీలో మహేష్ బాబుకు అభిమానులు ఉన్నప్పటికీ... ఇప్పటి వరకూ పాన్ ఇండియా సినిమా చేయలేదు. రాజమౌళి సినిమాతో ఆయన హిందీ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ గురించి మహేష్ బాబును ప్రశ్నించగా... తెలుగులో సినిమా చేసి హిందీలో విడుదల చేయవచ్చని చెప్పిన సంగతి తెలిసిందే. 


Also Read: హీరోయిన్ ఇంట్లో చోరీ, కొట్టిన్నర విలువ చేసే నగలు - డబ్బు మాయం