ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాలో దక్షిణాది చిత్ర పరిశ్రమ హవా కనిపిస్తోంది. 'బాహుబలి' మూవీ భాషా, ప్రాంతీయత హద్దులు చేరిపేయగా.. ఈ క్రమంలో వచ్చిన పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. RRR, KGF-2 లాంటి సినిమాలు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే, 'నాటు నాటు' పాట ఇండియన్ సినిమాకు చిరకాలంగా మిగిలిపోయిన ఆస్కార్ కలను నిజం చేసింది.

 

మరోవైపు బాలీవుడ్ మాత్రం రేసులో రోజు రోజుకీ వెనుకబడిపోతోంది. ఎంత పెద్ద సినిమా అయినా, ఎలాంటి స్టార్ హీరో చిత్రమైనా సరే బాక్సాఫీసు వద్ద కనీస వసూళ్లు రాబట్టలేక బొక్కబోర్లా పడుతున్నాయి. తమ మూలాలను మరచి ఇతర చిత్రాలను అనుకరించే ప్రయత్నంలో తన మెరుపును, గుర్తింపును కోల్పోయిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. పాండమిక్ తర్వాత హిందీ చిత్రాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో సౌత్ డైరెక్టర్స్ మణిరత్నం, వెట్రి మారన్, బాసిల్ జోసెఫ్, హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టిలు బాలీవుడ్ పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

 

బుధవారం చెన్నైలో జరిగిన సీఐఐ దక్షిణ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ రెండవ ఎడిషన్ లో వరల్డ్ సినిమాపై సౌత్ సినిమాల ప్రభావం గురించి మాట్లాడారు. ఈ ప్యానల్ మీటింగ్ లో RRR, పుష్ప: ది రైజ్, కాంతారా, KGF: చాప్టర్ 2' వంటి సినిమాల విజయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా హిందీ చిత్ర పరిశ్రమపై లెజెండరీ దర్శకుడు మణిరత్నం షాకింగ్ కామెంట్స్ చేశారు.

 

మణిరత్నం మాట్లాడుతూ, “హిందీ సినిమా తమను తాము బాలీవుడ్ అని పిలుచుకోవడం మానేయగలిగితే, ప్రజలు ఇండియన్ సినిమాను బాలీవుడ్ గా గుర్తించడం మానేస్తారు” అని కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ వెట్రిమారన్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలను చెప్పాల్సిన ప్రాముఖ్యత గురించి చెప్పాడు.

 

బాలీవుడ్, కోలీవుడ్ ఇలా.. తాను ‘వుడ్స్’ కి ఫ్యాన్ కాదని.. మొత్తం మీద ఇండియన్ సినిమాగానే చూడాలని వెట్రి మారన్ అన్నారు. “కళ అనేది విశ్వవ్యాప్తంగా ఉంటుంది. మేము మా ప్రజల గురించి, మా ప్రాంతాల గురించి లోతైన కథలు చెప్పడం వల్ల ప్రభావం ఏర్పడుతుంది” అని పేర్కొన్నాడు. 

 

ఈ సందర్భంగా రిషబ్ శెట్టి 'కాంతారా' సినిమాను అతి తక్కువ బడ్జెట్ తో తీసిన పాన్-ఇండియన్ సినిమా అని చెప్పాడు. స్థానిక కథలకు, మన మూలాలను తెలియజెప్పే సినిమాలకి విస్తృతమైన ఆధరణ ఉంటుందని అభిప్రాయ పడ్డారు.

 

ఇకపోతే ఇండియన్ సినిమాకు ఆస్కార్ ను తెచ్చిపెట్టిన 'నాటు నాటు' పాటకి కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ తో పాటుగా ఆస్కార్ విన్నింగ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కార్తికీ గోన్సాల్వేస్‌ లను ఈ కార్యక్రమంలో సన్మానించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ లో ప్రముఖ నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్లు, OTT ఫ్లాట్ ఫామ్ ప్రతినిధులు సహా మొత్తం 700 మంది పాల్గొన్నారని తెలుస్తోంది.