ఏ ఇండస్ట్రీలోనైనా ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు మాస్ ఆడియన్స్ ను అలరించే యాక్షన్ సినిమాలు తెరకెక్కిస్తే, మరికొందరు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే క్లాస్ చిత్రాలను రూపొందిస్తుంటారు. ఈ రెండిటికీ భిన్నమైన జోనర్స్ లో సినిమాలు తీసే దర్శకులు కూడా ఉన్నారు. అయితే ఎవరు ఎలాంటి సినిమా చేసినా, ఫైనల్ గా ప్రతి ఒక్కరూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. టాలీవుడ్ లో ఫీల్ గుడ్ చిత్రాలతో సెన్సిబుల్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్నవారు చాలామందే ఉన్నారు. అందరూ మెచ్చేలా, సామాజిక అంశాలను సున్నితంగా టచ్ చేస్తూ హిట్లు కొడుతున్నారు. అలాంటి దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం!

 

శేఖర్ కమ్ముల:

‘డాలర్ డ్రీమ్స్’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శేఖర్ కమ్ముల.. ఫస్ట్ మూవీతోనే పలు అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆనంద్, గోదావరి, లీడర్, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించి సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ సినిమా చేసినా అందులో సామాజిక అంశాలను చొప్పించడం శేఖర్ స్పెషాలిటీ. అందుకే ఆయన చిత్రాలకు అటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇటు యూత్ ఆడియెన్స్ ఫిదా అవుతుంటారు. ప్రస్తుతం కమ్ముల శేఖర్ కోలీవుడ్ హీరో ధనుష్ తో ఓ త్రిభాషా చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నారు.

 

హను రాఘవపూడి:

చేసింది తక్కువ సినిమాలే ఐనా తనదైన శైలి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి. పదేళ్ల కిందట అందాల రాక్షసి చిత్రంతో డైరక్టర్ గా కెరీర్ ప్రారంభించిన హను.. కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు వంటి ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించారు. మధ్యలో ట్రాక్ మార్చి లై మూవీ చేసినా వర్కవుట్ అవ్వలేదు. దీంతో తనకు అలవాటైన లవ్ జోనర్ లో సీతారామం సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.

 

వెంకీ అట్లూరి:

స్నేహ గీతం సినిమాతో హీరోగా పరిచయమైన వెంకీ అట్లూరి.. ఆ తర్వాత మెగా ఫోన్ పట్టుకొని డైరక్టర్ అవతారమెత్తాడు. తొలి ప్రయత్నంగా 'తొలి ప్రేమ' సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇదే క్రమంలో మిస్టర్ మజ్ను, రంగ్ దే చిత్రాలతో సెన్సిబుల్ అనిపించుకున్నాడు. ఇటీవల ధనుష్ తో కలిసి 'సార్' వంటి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 

బొమ్మరిల్లు భాస్కర్:

ఫ్యామిలీ ఎమోషన్స్ కు తన మార్క్ సందేశాన్ని జోడించి ప్రేక్షకులను అలరించే దర్శకుడు భాస్కర్. బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ లో క్రేజీ డైరక్టర్ గా మారిపోయాడు. ఆ తర్వాత పరుగు చిత్రంతో పర్వాలేదనిపించినా, ఆరెంజ్ తో ఫ్లాప్ చవిచూశాడు. యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్.. ఇటీవల రీ రిలీజ్ లో అదరగొట్టింది. భాస్కర్ చివరగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి ఫీల్ గుడ్ మూవీతో సూపర్ హిట్ సాధించాడు.

 

ఇంద్రగంటి మోహనకృష్ణ:

గ్రహణం చిత్రంతో డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులని అలరించిన ఇంద్రగంటి.. అష్టా చెమ్మా, గోల్కొండ హైస్కూల్, సమ్మోహనం వంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. జెంటిల్ మెన్, వి వంటి వేరే జోనర్ సినిమాలు చేసినప్పటికీ, క్లాస్ చిత్రాలే మోహనకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'తో నిరాశ పరిచిన ఆయన.. ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్ కు ప్లాన్ చేసుకుంటున్నారు.

 

శ్రీనివాస్ అవసరాల:

ఇంద్రగంటి మోహనకృష్ణ చేతుల మీదుగా హీరోగా లాంచ్ అయిన శ్రీనివాస్.. డైరక్టర్ గా, డైలాగ్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద చిత్రాలు అవసరాలకు సెన్సిబుల్ డైరక్టర్ గా పేరు తెచ్చిపెట్టాయి. ఈ మధ్య ఆయన డైరెక్ట్ చేసిన ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి సినిమా పెద్దగా ఆడలేదు.

 

శ్రీకాంత్ అడ్డాల:

మానవ సంబంధాల నేపథ్యంలో సున్నితమైన కథలను తెర మీదకు తీసుకొచ్చే సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. 'కొత్త బంగారులోకం' చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్స్ కు నాంది పలికాడు. అయితే ఆ తర్వాత వచ్చిన 'ముకుంద' మూవీ నిరాశ పరచగా.. 'బ్రహ్మోత్సవం' భారీ డిజాస్టర్ అయ్యింది. శ్రీకాంత్ చివరగా 'నారప్ప' వంటి రీమేక్ తో ఆడియన్స్ ను అలరించారు. 

 

గౌతమ్ తిన్ననూరి:

'మళ్లీరావా' వంటి లవ్ స్టోరీతో డైరెక్టర్ గా పరిచయమైన గౌతమ్.. 'జెర్సీ' లాంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని తెరకెక్కించి జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే జెర్సీ సినిమాని అదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తే, నిరాశే ఎదురైంది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఓ యాక్షన్ మూవీ తీస్తున్నాడు గౌతమ్.

 

శివ నిర్వాణ:

'నిన్ను కోరి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ.. 'మజిలీ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసిన టక్ జగదీష్ సినిమా నేరుగా డిజిటల్ లో రిలీజై, ఆశించిన స్థాయిలో అలరించలేదు. దీంతో ఇప్పుడు తనకు కలిసొచ్చిన ప్రేమకథతో ఖుషీ సినిమా తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.