Sivaji: బిగ్ బాస్ సీజన్ 7 కొన్నిరోజుల క్రితం పూర్తయ్యింది. అది పూర్తయినప్పటి నుండి ఎవరి ప్రొఫెషనల్ లైఫ్‌లో వారు బిజీ అయిపోయారు. ఇక బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లక ముందే ‘#90S’ అనే సిరీస్ చేశాడు శివాజీ. తను హౌజ్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ సిరీస్ విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న శివాజీ.. మరోసారి బిగ్ బాస్ జర్నీపై స్పందించాడు. అంతే కాకుండా రాజకీయ పరిస్థితులపై కూడా సీరియస్ అయ్యాడు. చిరంజీకి పద్మవిభూషణ్ రావడంపై కూడా ఆయన మాట్లాడాడు.


ముందెప్పుడూ బిగ్ బాస్ చూడలేదు..


బిగ్ బాస్ అనేది జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం అని శివాజీ ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. మరోసారి అదే విషయాన్ని రిపీట్ చేశాడు. ఇప్పటికీ తను బిగ్ బాస్ హౌజ్‌ను మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. ‘‘బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్లక ముందు శివాజీ అంటే పొలిటికల్ పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటాడేమో, కొంతమందికే సపోర్ట్ చేస్తాడేమో అనే భావన ఉండేది. కానీ బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్లిన తర్వాత శివాజీ అంటే శివన్న అయిపోయాడు’’ అని సంతోషం వ్యక్తం చేశాడు శివాజీ. ఇక తను బిగ్ బాస్ ఆఫర్‌ను ఒప్పుకోవడానికి ముఖ్య కారణం మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి అని తెలిపాడు. ఇంట్లో వాళ్లకి తను బిగ్ బాస్‌కు వెళ్లడం ఇష్టం లేదని, కానీ తాను మాత్రం ముందు ఈ షోను ఎప్పుడూ చూడలేదని రివీల్ చేశాడు. ఇక పల్లవి ప్రశాంత్, యావర్‌లతో కలిసి చేయనున్న ‘స్పై’ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుతూ.. అందరి వీలు చూసుకొని ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చాడు శివాజీ.


డబ్బుకు మాత్రమే చుట్టాలు..


ఆ సందర్భంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై మరోసారి ఫైర్ అయ్యాడు శివాజీ. ‘‘నాయకులు ఎవరికీ చుట్టాలు కాదు.. వారు డబ్బుకు మాత్రమే చుట్టాలు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చాలా చేసిందని నేను నమ్ముతాను. నాయకులు మెల్లగా డబ్బు పిచ్చిలో పడ్డారు. నాయకుల కంటే ఎక్కువగా జనాలకు డబ్బు పిచ్చి పట్టుకుంది. దాని వల్ల రాబోయే తరాలు దెబ్బతింటాయి. ప్రకృతి అందరినీ సమానంగానే చూస్తుంది. వెర్రి వేషాలు వేస్తే తీసుకెళ్లిపోతుంది. ఇది చెప్పడం నా ఉద్దేశ్యం. నాకు ఏ పార్టీ చుట్టం కాదు. నాకు ఏ నాయకుడు ఏ అన్యాయం చేయలేదు. పవన్ కళ్యాణ్ అయితే జనం సొమ్ము తినని నాయకుడిలాగా అనిపిస్తాడు. అంటే ఇంకా ఆయనకు అధికారం రాలేదు. వస్తే ఎలా ఉంటాడో తెలియదు’’ అంటూ రాజకీయ నాయకులపై తన అభిప్రాయన్ని బయటపెట్టాడు శివాజీ.


చొక్కా పట్టుకొని అడిగే ధైర్యం ఉందా.?


‘‘తప్పంతా ప్రజల్లోనే ఉంది. ప్రజలు మారనంత కాలం గతుకుల రోడ్లు ఇలాగే ఉంటాయి. అతుకుల బ్రతుకులు ఇలాగే ఉంటాయి. సమాజం ఎప్పటికీ బాగుపడదు. రాజకీయ నాయకులు వచ్చేదే బిజినెస్ చేయడానికి. సిగ్గుందా మీ అందరికీ. చొక్కా పట్టుకొని అడిగే ధైర్యం మీకు ఉందా? డబ్బులు తీసుకొని ఓటు వేసి అడిగే రైట్ మీకు ఎక్కడ ఉందిరా పనికిమాలినోళ్లారా’’ అంటూ ప్రజలపై సీరియస్ అయ్యాడు శివాజీ. చివర్లో తాను రాజకీయ నాయకుడిని కాదని, ప్రజల గురించి మాత్రమే మాట్లాడతానని క్లారిటీ ఇచ్చాడు. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై సంతోషం వ్యక్తం చేశాడు శివాజీ. అంతే కాకుండా బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ సెంటర్ల ద్వారా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ‘‘రాజకీయాలు బాలేదని ఆయన ప్రశాంతంగా తప్పుకున్నాడు. అలాంటి వాడు ఉండాలి. జనం సొమ్ము తినలేదు కదా. అదొక్కటి కూడా అయిపోతే బాగుంటుందని నా అభిప్రాయం’’ అని తెలిపాడు శివాజీ.


Also Read: ఎంజీఆర్‌ టు విజయ్‌ - రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్స్ వీళ్లే