Madhoo about Mani Ratnam: కేవలం ఒక్క సినిమాతోనే స్టార్లుగా మారిపోయిన నటీనటులు ఎంతోమంది ఉంటారు. ఒకవేళ వారు ఇండస్ట్రీ నుండి దూరమయినా.. ఆ ఒక్క సినిమాతోనే వారిని గుర్తుపెట్టుకుంటారు ప్రేక్షకులు. సీనియర్ నటి మధూ కెరీర్‌లో అలాంటి చిత్రం ‘రోజా’. మణిరత్నం తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అయ్యింది. ఆ తర్వాత కూడా మధూ హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించినా.. ‘రోజా’ తెచ్చిపెట్టిన గుర్తింపు మాత్రం ఇంకా ఏ సినిమా ఇవ్వలేకపోయింది. అయినా కూడా మణిరత్నం వల్లే తనకు అంతలా క్రేజ్ లభించినా.. మధు మాత్రం ఎప్పుడూ ఆ దర్శకుడికి సరిపడా క్రెడిట్ ఇవ్వలేదు. అలా ఎందుకు చేసిందో తాజాగా బయటపెట్టారు.


ఎవరినీ గాడ్‌ఫాదర్‌లాగా అనుకోలేదు..


మణిరత్నం దర్శకుడిగా వ్యవహరించిన ‘రోజా’లో మాత్రమే కాదు.. ‘ఇరువర్’లో కూడా నటించి మెప్పించారు మధు. కానీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు ఏమీ రాలేదు. అలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు మధు.. ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘‘ఒక్కొక్క నటీనటులతో మణి సార్ బాండింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను ఆయనకు చాలాసార్లు ఫోన్ చేశాను. మెసేజ్‌లు చేశాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆ సమయంలో నేను ఎవరినీ గాడ్‌ఫాదర్‌లాగా అనుకోలేదు. మణి సార్ నాకేం సాయం చేయలేదు. ఆయన రోజా చేయాలనుకున్నారు. ఆ రోజాను నాలో చూసుకున్నారు. అందులో స్పెషల్ ఏముంది అన్నట్టు ఉండేది నా యాటిట్యూడ్’’ అని చెప్పుకొచ్చారు మధూ.


బాధ వల్లే..


తన ప్రవర్తన ఎందుకు అలా ఉండేది అని మధూను ప్రశ్నించగా.. ‘‘బాధతో అలా వచ్చేసేది. అన్నింటిలో నేను అనే స్వార్థం ఉండేది. నేనే అన్ని చేసుకున్నాను కాబట్టి ఎవరికీ క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడేదాన్ని కాదు’’ అని బయటపెట్టారు మధూ. అలాంటి యాటిట్యూడ్‌ చాలామంది నచ్చి ఉండకపోవచ్చని ఆమె అన్నారు. ‘‘మణి సార్‌కు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సింది. ఆ సమయంలోనే నేను ఆయనకు చెప్పి ఉండాల్సింది. ఇప్పుడు ఆయనకు మొత్తం క్రెడిట్ ఇచ్చేస్తున్నాను. ఆయన నాకొక గుర్తింపు ఇచ్చారు. నేను ఎవ్వరితో మంచి బాండింగ్ పెట్టుకోలేదు. అందుకే ఎక్కువగా ఎవ్వరితో మళ్లీ మళ్లీ సినిమాలు చేయలేదు’’ అని మధూ అన్నారు.


అన్నీ నేను చేసుకున్నా..


‘రోజా’ సక్సెస్ అయిన తర్వాత మణిరత్నంతో మంచి బాండింగ్‌ను ఏర్పరచుకోవాల్సిందని మధూ వాపోయారు. కెరీర్ మొదట్లో మేకప్ దగ్గర నుండి కాస్ట్యూమ్స్ వరకు అన్ని తానే సమకూర్చుకునేదాన్ని అని, ఎవరూ సాయం చేయలేదు అని, అందుకే తన సక్సెస్ అయినా.. ఫెయిల్యూర్ అయినా క్రెడిట్ ఎవరికీ ఇవ్వను అని ముక్కుసూటిగా చెప్పేశారు. అందుకే ‘రోజా’లాంటి సినిమాతో విపరీతమైన సక్సెస్ వచ్చినా ఆ తర్వాత తను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయలేకపోయింది. తల్లి పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా కూడా ఇప్పటికీ తన ఒక సినిమాకు, మరో సినిమాకు చాలా గ్యాప్ ఉంటుంది. ఇక మధూ చివరిగా సమంత హీరోయిన్‌గా తెరకెక్కిన ‘శాకుంతలం’లో మేనకగా నటించి మెప్పించారు.


Also Read: అతను గుడివాడ రౌడీ - కొడాలి నానిపై నందమూరి చైతన్య కృష్ణ పరోక్ష వ్యాఖ్యలు