Nandamuri Chaitanya Krishna about Kodali Nani: నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్నో బ్లాక్‌బస్టర్ యాక్షన్ సినిమాల్లో ‘సమరసింహారెడ్డి’ కూడా ఒకటి. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఈ సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో మరో నందమూరి హీరో అయిన చైతన్య కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి చైతన్య కృష్ణ.. ‘సమరసింహారెడ్డి’ సినిమాలోని డైలాగ్ చెప్పి అందరినీ అలరించారు. అంతే కాకుండా కొడాలి నానిపై పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


తొడకొట్టి మరీ..


బాలకృష్ణ సినిమాలు అంటేనే తొడకొట్టడం, పవర్‌ఫుల్ డైలాగులతో విలన్స్‌కు వార్నింగ్ ఇవ్వడం.. అందుకే ముందుగా ‘సమరసింహారెడ్డి’ రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో ముందుగా తొడకొట్టి తన స్పీచ్‌ను మొదలుపెట్టారు నందమూరి చైతన్య కృష్ణ. ఈ సినిమా కోసం దర్శకుడు బీ గోపాల్, పరుచూరి బ్రదర్స్ కలిసి ఎంత పవర్‌ఫుల్ డైలాగులు రాశారు గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా ‘నీ ఇంటికి వచ్చా’ అంటూ డైలాగ్ కూడా చెప్పారు. బీ గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్ ఎప్పుడూ హిట్టే అని వారి కాంబోలో వచ్చిన చిత్రాల గురించి మాట్లాడారు. కానీ అన్ని సినిమాల్లో ‘సమరసింహారెడ్డి’ అనేది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చైతన్య కృష్ణ అన్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది మొదటి యాక్షన్ మూవీ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ‘లారీ డ్రైవర్’ సినిమాలోని ఒక డైలాగును గుర్తుచేసుకుంటూ కొడాలి నానిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.


డైలాగ్ పేలింది..


బీ గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మరో మూవీ ‘లారీ డ్రైవర్’. ఈ సినిమాలో ‘నా పేరు గుడివాడ రాయుడు, కానీ నోరు తిరగక వాళ్లు నన్ను గుడివాడ రౌడీ అంటున్నారు’ అంటూ విలన్ చెప్పే డైలాగ్‌ను రిపీట్ చేశారు నందమూరి చైతన్య కృష్ణ. ‘‘ఈరోజు నిజంగానే అక్కడ గుడివాడలో ఒక రౌడీ ఉన్నాడు’’ అన్నారు. ఆ మాటకు ఎవరో కొడాలి నాని అని అరిచారు. అది విన్న చైతన్య కృష్ణ.. ‘‘ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. గుడివాడ రౌడీ. బీ గోపాల్ గారు ఏ ముహూర్తంలో ఆ డైలాగ్ కొట్టారో అద్భుతంగా పేలింది’’ అని ప్రశంసించారు. ఇక బాలకృష్ణ, బీ గోపాల్ కాంబినేషన్‌లోని బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సమరసింహారెడ్డి’.. మార్చి 2న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.



కొన్నాళ్లు బ్రేక్..


ఇప్పటికే నందమూరి కుటుంబం నుండి వచ్చిన హీరోలు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా ఎన్‌టీఆర్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఇక ఇటీవల సీనియర్ ఎన్‌టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ వారసుడు చైతన్య కృష్ణ కూడా హీరోగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తను లీడ్ రోల్ చేసిన ‘బ్రీత్’ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్నేళ్ల క్రితం చైతన్య కృష్ణ హీరోగా పలు చిత్రాల్లో నటించినా.. ఎందుకో కాస్త గ్యాప్ ఇచ్చారు. చాలాకాలం తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘బ్రీత్’ కొంతవరకు ప్రేక్షకులను అలరించింది.


Also Read: డిప్రెషన్ వల్లే డ్రగ్స్ తీసుకున్న షణ్ముక్ - సూసైడ్ చేసుకోవాలనుకున్నాడా? వెలుగులోకి సంచలన నిజాలు!