మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. మన దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన వీడియో ఇది. ఇక ఈ స్పెషల్ వీడియో నుంచి మంగళవారం రోజున 'సత్య' అనే పేరుతో ఓ టీజర్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ వీడియోలో సాయి తేజ తో కలిసి కలర్స్ స్వాతి నటించగా.. 'సోల్ ఆఫ్ సత్య' అనే పేరుతో మేకర్స్ ఈ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో కూడా టైటిల్ కు తగ్గట్టే ఉంది. ఒకసారి ఈ గ్లిమ్స్ ని గమనిస్తే.. ఇందులో సాయి ధరంతేజ్, కలర్స్ స్వాతి పెళ్లి చేసుకోవడం, ప్రేమతో వెనుక నుంచి కౌగిలించుకుని ముద్దు పెట్టుకొనే సన్నివేశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యూజికల్ షార్ట్ లోని పాటను సింగర్ శృతి రంజని కంపోజ్ చేశారు.


'సత్య' అనే ఈ స్పెషల్ వీడియో తో ఆమె మ్యూజిక్ డైరెక్టర్ గా జర్నీ ప్రారంభించారు. ఇక ఇందులో సాయి తేజ్ ఓ సైనికుడిగా కనిపిస్తారు. ఓ సైనికుడు భారతదేశం కోసం చేసే త్యాగాలను ఇందులో చూపిస్తున్నారు. 'సత్య' లోని ప్రధానమైన ఎమోషన్ కూడా ఇదే. ఇక ఈ మ్యూజికల్ షార్ట్ లో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి తమదైన ఎమోషన్స్ ని పలికించారు. అంతేకాదు ఈ వీడియోతో వారెంత మంచి నటీనటులో రుజువైందనే చెప్పాలి. మన దేశం కోసం పోరాటం చేసే ఎంతోమంది యోధులకు సంబంధించిన ఓ మంచి సందేశాన్ని తెలియజేయడానికి మేకర్స్ చేసిన ఈ ప్రయత్నం ఆకట్టుకునేలా ఉంది. ఇక సాయిధరమ్ తేజ్ తో పాటు అతని స్నేహితులు హర్షిత్ రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ ఈ మ్యూజికల్ షార్ట్ లో భాగస్వాములు అయ్యారు.


దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'బలగం' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ మ్యూజికల్ షార్ట్ ని నిర్మించగా.. నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు. బాలాజీ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సాయి తేజ్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక 'విరూపాక్ష' తర్వాత రీసెంట్ గా 'బ్రో' సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు.


మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి సాయి తేజ నటించిన ఈ సినిమాని సముద్రఖని డైరెక్ట్ చేయగా.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ సినిమా జూలై 28న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సాయి తేజ్ ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక 'బ్రో' సినిమా తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ఓ కమర్షియల్ యాక్షన్ మూవీ చేస్తున్నారు సాయి తేజ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకి 'గాంజా శంకర్' అనే మాస్ టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.


 



Also Read : రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారు - ‘భోళాశంకర్’ మూవీపై కోర్టుకెక్కిన డిస్ట్రిబ్యూటర్





Join Us on Telegram: https://t.me/abpdesamofficial