టాలీవుడ్ లో పలు సినిమాలను నిర్మించి ప్రస్తుతం నిర్మాతలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు అనిల్ సుంకర , గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారంటూ విశాఖపట్నంకి చెందిన ప్రముఖ ఫిలిం డిస్టిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్ వైజాగ్) ఆరోపిస్తూ బుధవారం తనకు జరిగిన అన్యాయంపై ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. "ఏజెంట్ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ నన్ను మోసం చేశారు. వాళ్ళు చేసిన అన్యాయం ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏప్రిల్ నెలాఖరులో రిలీజైన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక.. మూడు రాష్ట్రాలకు ఐదు సంవత్సరాల పాటు నాకు చెందిన గాయత్రీ దేవి ఫిలిమ్స్ కు ఇస్తామని అగ్రిమెంట్ నాకు రాసిచ్చి, 30 కోట్ల రూపాయలు తీసుకొని నన్ను మోసం చేశారు" అని తెలిపారు.


"బ్యాంక్ అకౌంట్ రూపంలో నా సహచర వ్యాపార మిత్రులు సహకారంతో రూ.30 కోట్ల రూపాయల వైట్ మనీని ఏజెంట్ సినిమా మూడు రాష్ట్రాల హక్కుల కోసం నేను చెల్లించినట్టు పక్కాగా ఆధారాలు ఉన్నప్పటికీ వాళ్లు ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను విడుదల సమయంలో కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే అందజేసి అగ్రిమెంట్కు తూట్లు పొడిచారు. ఆ తర్వాత మే 1వ తేదీన హైదరాబాద్లోని వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి గరికపాటి కృష్ణ కిషోర్ ను నేను కలవడం జరిగింది. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ‘ఏజెంట్’ సినిమాకు ఫైనాన్స్ సమస్యలు ఎదురయ్యాయి. సినిమా డిజాస్టర్ అయిందని చెప్పి మరుసటి రోజు అనగా.. మే 2వ తేదీన మళ్లీ ఆఫీసుకు వస్తే అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని నాకు చెప్పారు. నాకు అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వడంతో డబ్బులు ఎలాగైనా వస్తాయన్న నమ్మకంతో తిరిగి వైజాగ్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత వారు చేసిన 'సామజవరగమన' సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను విశాఖపట్నం వరకు నాకే ఇచ్చారు"ని అన్నారు.


"ఆ సినిమా ద్వారా కేవలం కొద్ది డబ్బు మాత్రమే నాకు కవర్ అయింది. ఈ నేపథ్యంలో 45 రోజుల్లో నాకు రావలసిన మిగతా డబ్బును చెల్లిస్తామని, ఒకవేళ అలా చెల్లించకపోతే తమ తదుపరి సినిమా విడుదలలోపు ఇస్తామని నాతో ఒప్పందం చేసుకున్నారు. అయితే వాళ్ల తదుపరి సినిమా 'భోళాశంకర్' అయింది. కానీ కొద్ది రోజుల నుంచి వాళ్ళు నాకు సమాధానం ఇవ్వడం మానేశారు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు కూడా ఈ విషయం చెప్పి సంప్రదింపులు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగడం కోసం తప్పనిసరి పరిస్థితులలో కోర్టుకు వెళ్లడం జరిగింది. విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్ గా సినీ పరిశ్రమతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. 'రంగస్థలం', 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' వంటి అనేక సినిమాలను నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పైన వారు నిర్మించిన అలాగే ఇతర బ్యానర్స్ పైన భాగస్వాములతో కలిసి వారు తీసిన అనేక సినిమాలను నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను. గతంలో ఎప్పుడూ డబ్బు గురించి సమస్యలు కానీ మోసాలు కాని తలెత్తలేదు" అని అన్నారు


"కానీ ఇప్పుడు మాత్రం ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ వారు నా దగ్గర రూ.30 కోట్లు తీసుకుని సమాధానం చెప్పకుండా ఎగ్గొట్టాలనే తలంపుతో ఆఖరికి నా మీద ఫోర్జరీ చేశారని నింద కూడా వేశారు. వాస్తవానికి ఆ మధ్య యూరోస్ ఇంటర్నేషనల్ వారికి వీరు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడంతో వీరిపై ఆ సంస్థ కేసులు కూడా పెట్టింది. అలాగే ఎంతోమందిని మోసం చేస్తూ వీరు తమ గుడ్ విల్ ను పోగొట్టుకున్నారు. ఇంకా ఎంతో మందికి వీళ్ళు బాకీలు ఉన్నారు. నా నీతి, నిజాయితీ ఏంటో సినీ పరిశ్రమతో పాటు అందరికీ తెలుసు. అయితే తెలియని వారి కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నాకు న్యాయం జరగాలని ఆశిస్తూ అడ్వకేట్ కేశాపురం సుధాకర్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అంతేకాకుండా వాళ్లపై క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అలాగే ఫైనాన్షియర్స్ అందరి పైన ఈడికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది" అని తెలిపారు


"మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు ఎంతో ఇష్టం. వారు నటించిన సినిమా అన్న ఉద్దేశంతోనే నేను ఆచితూచి ఇంతవరకు ఎక్కడా మీడియా దగ్గరికి వెళ్లకుండా ముందుకు సాగాను. కానీ నా మీద ఎప్పుడైతే ఫోర్జరీ నింద వేసి ఆ వార్తలను గ్రూపులలో తిప్పిస్తూ నన్ను అప్రతిష్టపాలు చేస్తున్నారు. అయినా కూడా నిజాయితీ, న్యాయం గెలుస్తాయని నేను నమ్ముతున్నాను. బుధవారం సాయంత్రం కోర్టులో విషయం తేలిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడతాం. వాస్తవాలను మీడియా ముందు ఉంచుతాం" అని  తెలిపారు.


Also Read : రీల్ గర్ల్‌ఫ్రెండ్‌తో రియల్ లవ్ - ఆ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial